ఛీ కొట్టారు, అవమానించారు.. కట్‌చేస్తే.. ఆ అవార్డ్‌తో ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్

Sanju Samson Cricket Journey: ఎదురుదెబ్బలే విజయానికి పునాదులు అని సంజూ శాంసన్ మరోసారి నిరూపించాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టి, దేశానికి ప్రపంచకప్ అందించిన సంజూ కథ ఎందరో యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచింది. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న శాంసన్.. అద్భుత ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్‌ను కూడా గెలుచుకున్నాడు.

ఛీ కొట్టారు, అవమానించారు.. కట్‌చేస్తే.. ఆ అవార్డ్‌తో ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్
Ind Vs Nz Sanju Samson Journey

Updated on: Mar 09, 2026 | 10:56 AM

Sanju Samson Cricket Journey: టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ శాంసన్ భారత్ తరపున అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. టోర్నీ ఆరంభంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైనా, అవకాశం వచ్చినప్పుడు కేవలం 5 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం సంజూకు అంత సులభంగా జరగలేదు. చిన్నతనంలో ఎదురైన అవమానాలు, తండ్రి చేసిన త్యాగం అతడిని నేడు ఈ స్థితిలో నిలబెట్టాయి.

విరాట్ కోహ్లీలాగే రిజెక్షన్..

సంజూ శాంసన్ కథ విరాట్ కోహ్లీ కథను పోలి ఉంటుంది. కోహ్లీని కెరీర్ ఆరంభంలో ఢిల్లీ సెలెక్టర్లు అండర్-14 ట్రయల్స్‌లో రిజెక్ట్ చేశారు. సంజూ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఢిల్లీలోని జూనియర్ లెవల్ క్రికెట్‌లో సంజూకు తీవ్ర చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒక జూనియర్ టోర్నమెంట్‌లో 8 మ్యాచ్‌ల్లో 500కు పైగా పరుగులు చేసినప్పటికీ, ఢిల్లీ అండర్-13 జట్టులో అతనికి చోటు దక్కలేదు.

తండ్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం..

సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ అప్పట్లో ఢిల్లీ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా ఉండేవారు. కొడుకు ప్రతిభకు ఢిల్లీలో గుర్తింపు లభించకపోవడంతో ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి, కుటుంబాన్ని కేరళకు మార్చేశారు. అప్పట్లో కేరళలో క్రికెట్ వ్యవస్థ అంత బలంగా లేదు, పైగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది ఒక పెద్ద రిస్క్. కానీ తన కొడుకుపై ఉన్న నమ్మకంతో ఆయన వెనకడుగు వేయలేదు.

కేరళలో తిరుగులేని ప్రస్థానం..

కేరళకు వెళ్ళిన తర్వాత సంజూ రెట్టింపు కష్టపడ్డాడు. అండర్-13 స్థాయిలో 5 మ్యాచ్‌ల్లోనే 973 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 ఏళ్లకే రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టి, కేరళ తరపున సెంచరీలతో చెలరేగాడు. ఆపై ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్నాడు. ఆ నిలకడైన ప్రదర్శనే అతడికి టీమిండియా తలుపులు తెరిచేలా చేసింది.

విరాట్ కోహ్లీ ప్రశంసలు..

సంజూ ప్రదర్శనపై విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “అద్భుతమైన టోర్నమెంట్ ఆడావు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నువ్వు పూర్తి అర్హుడవు సంజూ. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించావు. నీ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది, చెట్టా (అన్నయ్య)” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us