మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి ఔట్.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?

India vs New Zealand ODI 2026: తాజా నివేదిక ప్రకారం, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కావ్యపాప ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్ దక్కింది.

మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి ఔట్.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
Team India 2027 World Cup
Image Credit source: X

Updated on: Dec 28, 2025 | 10:51 AM

Rishabh Pant to be Dropped for New Zealand ODI Series: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు వన్డే క్రికెట్‌లో గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. 2026 ప్రారంభంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి పంత్‌ను తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న మరో విధ్వంసకర బ్యాటర్ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత క్రికెట్ జట్టు సెలక్టర్లు వన్డే ఫార్మాట్‌లో పంత్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత టెస్టుల్లో అదరగొడుతున్న పంత్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ?..

రిషబ్ పంత్ స్థానంలో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, తన జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై కేవలం 33 బంతుల్లోనే శతకం బాది తన భీకర ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఈ పరుగుల వేట అతడిని మళ్ళీ సెలక్టర్ల దృష్టిలో పడేలా చేసింది.

ఇవి కూడా చదవండి

పంత్‌కు వరుస ఎదురుదెబ్బలు..

2024 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే తర్వాత పంత్ మళ్ళీ ఈ ఫార్మాట్‌లో మైదానంలోకి దిగలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ, అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మొదటి ఛాయిస్‌గా ఉండగా, బ్యాకప్ కీపర్‌గా పంత్ కంటే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపేలా సెలక్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో పంత్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ..

మెడ గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్‌కు గిల్ నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు కూడా ఈ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లకు పనిభారం కారణంగా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

షెడ్యూల్..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి 18 వరకు జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3 లేదా 4వ తేదీన బీసీసీఐ ప్రకటించనుంది.

రిషబ్ పంత్‌ను వన్డేల నుంచి తప్పిస్తే, అతను ఇకపై కేవలం టెస్టు స్పెషలిస్ట్ ఆటగాడిగా మారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇషాన్ కిషన్ తన దూకుడుతో వన్డే జట్టులో శాశ్వత స్థానం సంపాదించుకుంటాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..