Rishabh Pant : అర్ధరాత్రి ముఖ్యమంత్రికి రిషబ్ పంత్ రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన సీఎం

Rishabh Pant : టీమిండియా స్టార్ రిషభ్ పంత్ అర్ధరాత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి కీలక రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి నివాసం మార్చుకోవాలనుకుంటున్నానని, స్థలం కోసం సహాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం, అధికారులకు ఆదేశాలు జారీ చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Rishabh Pant : అర్ధరాత్రి ముఖ్యమంత్రికి రిషబ్ పంత్ రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన సీఎం
Rishabh Pant

Updated on: Aug 08, 2026 | 10:54 AM

Rishabh Pant : భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదిక Xలో చేసిన ఒక పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం అర్ధరాత్రి 12:46 గంటలకు ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని టాగ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ పెట్టారు. తాను ఢిల్లీ నుంచి తన నివాసాన్ని సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలని భావిస్తున్నానని, అక్కడ తనకు సరిపడా స్థలం దొరకడం లేదని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో కొన్ని వ్యాకరణ దోషాలు ఉండటంతో పంత్ ఆరోగ్యం లేదా పరిస్థితిపై అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.

సొంత మట్టిపై ప్రేమ చాటుకున్న పంత్

పంత్ తన పోస్ట్‌లో పేర్కొంటూ.. “హలో సార్, ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ వాసిగా నేను చాలా కాలంగా ఢిల్లీ నుంచి నా నివాసాన్ని ఉత్తరాఖండ్‌కు మార్చాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఇక్కడ నివసించడానికి పెద్దగా, సౌకర్యవంతంగా ఉండే స్థలం దొరకడం లేదు. నేను నా ఉత్తరాఖండ్‌ను ఎంతో ప్రేమిస్తున్నాను. స్థల సేకరణ విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి. నా కొండ ప్రజల మధ్యకు తిరిగి వచ్చి వారి కోసం ఏదైనా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. గత మూడేళ్లుగా స్థలం కోసం వేచి చూస్తున్నాను, మీ సమాధానం కోసం నిరీక్షిస్తున్నాను” అని తెలిపారు.

వెంటనే స్పందించి హామీ ఇచ్చిన సీఎం

రిషభ్ పంత్ చేసిన ట్వీట్ వైరల్ కాగానే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సానుకూలంగా స్పందించారు. పంత్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.. “ప్రియమైన రిషభ్, నువ్వు ఉత్తరాఖండ్ గర్వకారణానివి. నీ అద్భుతమైన ప్రదర్శనతో దేశవిదేశాల్లో దేవభూమి కీర్తిని పెంచావు. సొంత గడ్డపై నీకున్న ప్రేమ, మాతృభూమికి సేవ చేయాలనే నీ తపన అభినందనీయం. నువ్వు లేవనెత్తిన విషయంపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నాం. వారు త్వరలోనే నిన్ను సంప్రదించి నిబంధనల ప్రకారం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు” అని సీఎం హామీ ఇచ్చారు.

మరిన్ని విశేషాలు

రిషభ్ పంత్ గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రావాల్సిన భూమి లేదా ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాలను కూడా ఆయన తన పోస్ట్‌లో పరోక్షంగా ప్రస్తావించారు. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ప్రీ-ఆక్షన్ డీల్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 15 కోట్లకు పంత్‌ను తిరిగి దక్కించుకున్న విషయం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us