కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌.. ఇకనైనా టీమిండియా నుంచి తప్పుకోండ్రా బాబు..

Worst Over by Indian Spinner: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇద్దరూ కలిసి తమ 8 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. దీంతో వీరిద్దరిపేరుతో ఓ చెత్త రికార్డ్ నమోదైంది.

కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌.. ఇకనైనా టీమిండియా నుంచి తప్పుకోండ్రా బాబు..
Ind Vs Eng Arshdeep Singh Ravi Bishnoi Bowling

Updated on: Jul 05, 2026 | 10:33 AM

Worst Over by Indian Spinner: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీవ్ర నిరాశపరిచాడు. ఒకే ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన భారతీయ స్పిన్నర్‌గా చెత్త రికార్డును తన మూటగట్టుకున్నాడు. ఈ ఘోర పరాభవంతో టీమిండియా సిరీస్‌లో వెనుకబడింది.

చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌.. చేజార్చిన బౌలర్లు..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక దశలో ఇంగ్లాండ్ కేవలం 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేసినప్పటికీ, మిగతా బౌలర్లు ఆ పట్టును నిలబెట్టలేకపోయారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇద్దరూ కలిసి తమ 8 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

ఇవి కూడా చదవండి

బిష్ణోయ్ ఓవర్లో బెథెల్ విధ్వంసం..

మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో 17వ ఓవర్ వేయడానికి రవి బిష్ణోయ్ బంతిని అందుకున్నాడు. అప్పటివరకు ఇంగ్లాండ్ విజయానికి 24 బంతుల్లో 59 పరుగులు కావాలి. భారత్ గెలుపు ఖాయమని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, బిష్ణోయ్ వేసిన ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ బౌండరీల వర్షం కురిపించాడు.

ఆ ఓవర్లో బిష్ణోయ్ లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా తప్పాడు. రెండు నో-బాల్స్ వేసి ప్రత్యర్థికి ఫ్రీ-హిట్ అవకాశాలు ఇచ్చాడు. బెథెల్ ఆ రెండు ఫ్రీ-హిట్లను భారీ సిక్సర్లుగా మలిచాడు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మొత్తం 29 పరుగులు వచ్చాయి. దీనితో ఇంగ్లాండ్ సమీకరణం కాస్తా 18 బంతుల్లో 20 పరుగులుగా మారిపోయింది. 191 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఈ ఒక్క ఓవర్ దెబ్బకు మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయింది.

చెత్త రికార్డుల జాబితాలో బిష్ణోయ్..

భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ (29 పరుగులు) ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే శివమ్ దూబే (34 పరుగులు), స్టువర్ట్ బిన్నీ (32 పరుగులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సైతం ఒకే ఓవర్లో 27 పరుగులు ఇచ్చుకుని తీవ్రంగా నిరాశపరిచాడు.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

అభిమానుల ఆగ్రహం..

ఈ ఘోర పరాజయంపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రవి బిష్ణోయ్ కేవలం గూగ్లీలపైనే ఆధారపడుతున్నాడని, బంతిని ఒకే చోట స్థిరంగా పిచ్ చేయలేకపోతున్నాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్‌లోనే బెంచ్‌కే పరిమితమైన ఆటగాడిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎలా ఆడిస్తారంటూ జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 76 పరుగులు) అజేయ పోరాటంతో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత బౌలర్లు తదుపరి మ్యాచ్‌కైనా తప్పులు దిద్దుకుని పుంజుకుంటారో లేదో చూడాలి. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జూలై 7న నాటింగ్‌హామ్‌లో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us