
RR vs GT Qualifier 2: క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ క్లైమాక్స్ క్షణాలకు చేరుకుంది. న్యూ చండీగఢ్ వేదికగా నేడు జరగబోయే రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ చేరడమే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతుండగా, రాజస్థాన్ను ఒక అద్భుతమైన సెంటిమెంట్ ఊరిస్తోంది.
ఐపీఎల్ చరిత్ర పుటలను ఒక్కసారిగా తిరగేస్తే ఒక అద్భుతమైన ఆసక్తికర నిజం బయటపడింది. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి, ఆపై రెండో క్వాలిఫయర్ కూడా గెలిచి, ఫైనల్లో ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే రికార్డు సృష్టించింది. సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన ఆ అద్భుతాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేసే మహత్తర అవకాశం రాజస్థాన్ రాయల్స్ రూపంలో కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టును చిత్తు చేసి పట్టుదలగా ఉన్న రియాన్ పరాగ్ సేన, ఇప్పుడు అదే సెంటిమెంట్తో 2008 తర్వాత మళ్లీ ఛాంపియన్గా అవతరించాలని భావిస్తోంది. ఈ చారిత్రాత్మక సెంటిమెంట్ను చూసి రాజస్థాన్ రాయల్స్ అభిమానులు ఈసారి కప్పు మనదేనంటూ సామాజిక మాధ్యమాల్లో పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం క్రీడా లోకం అంతా 15 ఏళ్ల యువ కిశోరం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సంచలనం సృష్టించిన వైభవ్ పైనే నేడు అందరి కళ్లూ ఉన్నాయి. క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన శతకం రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్న ఈ కుర్రాడు, ఒకే సీజన్లో ఏకంగా 65 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల క్రితం గేల్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టిన వైభవ్, నేటి మ్యాచ్లో కూడా బ్యాట్ జులిపిస్తే గుజరాత్ బౌలర్లకు మైదానంలో చుక్కలు కనబడడం ఖాయం.
పరస్పర రికార్డుల పరంగా చూస్తే మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన పది మ్యాచ్లలో గుజరాత్ టైటాన్స్ ఏడు సార్లు విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే గణాంకాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ముఖ్యంగా రాజస్థాన్ జట్టులో ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రారంభ ఓవర్లలోనే ఆర్చర్ వికెట్లు పడగొట్టి, పవర్ప్లేలో వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపిస్తే రాజస్థాన్ రాయల్స్కు తిరుగుండదు.
నేటి మ్యాచ్ జరగబోయే ముల్లాన్పూర్ మైదానం ఈ సీజన్లో పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలిస్తోంది. ఇక్కడి పిచ్పై బంతి చక్కగా బ్యాట్పైకి వస్తుండడంతో భారీ షాట్లు ఆడడం బ్యాటర్లకు చాలా సులువుగా మారింది. ఈ మైదానంలో సగటు స్కోరు 220 కి పైగా నమోదవుతుండడం గమనార్హం. ఓవైపు చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో రాజస్థాన్, మరోవైపు లీగ్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని గుజరాత్ తలపడుతుండడంతో ఈ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..