4 ఓవర్లు.. 5 పరుగులు.. 4 వికెట్లు..16 ఏళ్ల స్పిన్నర్‌ ధాటికి లంక విలవిల.. టీమిండియా సెమీస్‌ ఆశలు సజీవం

|

Jan 22, 2023 | 10:14 PM

16 ఏళ్ల లెగ్ స్పిన్నర్ పర్సవీ చోప్రా (5/4) స్పిన్‌ మాయాజాలం, సౌమ్య తివారీ మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తద్వారా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

4 ఓవర్లు.. 5 పరుగులు.. 4 వికెట్లు..16 ఏళ్ల స్పిన్నర్‌ ధాటికి లంక విలవిల.. టీమిండియా సెమీస్‌ ఆశలు సజీవం
Team India
Follow us on

భారత అమ్మాయిలు మళ్లీ పుంజుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు మళ్లీ విజయపథంలోకి దూసుకెళ్లింది. ఆదివారం (జనవరి 22) జరిగిన సూపర్-సిక్స్ రౌండ్‌లో తమ రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. 16 ఏళ్ల లెగ్ స్పిన్నర్ పర్సవీ చోప్రా (5/4) స్పిన్‌ మాయాజాలం, సౌమ్య తివారీ మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తద్వారా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సూపర్ సిక్స్‌లోని ఈ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు కేవలం 87 పరుగులకే ఆలౌటైంది.  అయితే ఈ ఘోర పరాజయం నుంచి 24 గంటల్లోనే కోలుకుని శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

లెగ్ స్పిన్నర్ ఉచ్చులో విలవిల..

టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కెప్టెన్ షెఫాలీ వర్మ నిర్ణయం సరైనదని భారత బౌలర్లు నిరూపించారు. భారత జట్టు శ్రీలంకను ఆలౌట్ చేయలేకపోయినా కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో లంక అమ్మాయిలు పరుగులు తీసేందుకు నానా కష్టాలు పడ్డారు. ముఖ్యంగా16 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌ పర్సవీ చోప్రా (5/4) తన స్పిన్‌ మాయాజాలంతో లంకేయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. విష్మీ గుణరత్నే (25) మాత్రమే రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది శ్రీలంక. ఆతర్వాత లక్ష్యం చిన్నదే అయినా ఆస్ట్రేలియాతో జరిగిన పరాజయం కారణంగా నెట్ రన్‌రేట్ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆదినుంచి దూకుడుగా ఆడింది టీమ్ ఇండియా. అయితే కెప్టెన్ షెఫాలీ వర్మ(15), శ్వేతా సెహ్రావత్ (13), రిచా ఘోష్‌(4)లు త్వరగా ఔటయ్యారు. అయితే భోపాల్‌కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి సౌమ్య తివారీ ఫోర్ల వర్షం కురిపించింది. కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు చేసి జట్టును 7.2 ఓవర్లలో అంటే 44 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..