IND vs PAK : ఆడనంటే ఆడనని ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చేసింది ? పాక్ బడ్జెట్ తన్నేసిందా..ఇంకేదైనా ఉందా ?

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. తొలుత ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, చివరి నిమిషంలో యూ-టర్న్ తీసుకుంది.

IND vs PAK : ఆడనంటే ఆడనని ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చేసింది ? పాక్ బడ్జెట్ తన్నేసిందా..ఇంకేదైనా ఉందా ?
India Vs Pakistan T20 Wc

Updated on: Feb 11, 2026 | 10:17 AM

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. తొలుత ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, చివరి నిమిషంలో యూ-టర్న్ తీసుకుంది. క్రికెట్ స్ఫూర్తి కోసం ఆడుతున్నామని చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఐసీసీ ఆర్థిక ఒత్తిడి, దౌత్య వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.

బహిష్కరణ నుంచి యూ-టర్న్ వరకు..

టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించడాన్ని నిరసిస్తూ, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన ఈ మ్యాచ్ జరగకపోతే ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ పడుతుందని విశ్లేషకులు భావించారు. అయితే, పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వారిపైనే తిరగబడింది.

పాక్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణాలు

ఐసీసీ ఆర్థిక దెబ్బ : వరల్డ్ కప్ మ్యాచ్‌ను ఆడబోమని చెబితే భారీ జరిమానాలు విధిస్తామని, ఐసీసీ నుంచి వచ్చే వార్షిక నిధులను నిలిపివేస్తామని ఐసీసీ హెచ్చరించింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే సుమారు రూ. 1,470 కోట్ల నష్టం వస్తుందని లెక్క తేలింది. ఈ ఆదాయం కోల్పోవడం పాక్ బోర్డుకు ఆత్మహత్యా సదృశ్యమని గ్రహించి వారు మెత్తబడ్డారు.

శ్రీలంక ఎమోషనల్ కార్డు: ఈ వరల్డ్ కప్ ఆతిథ్య దేశమైన శ్రీలంక, పాకిస్థాన్‌కు ఘాటైన లేఖ రాసింది. 2009లో లాహోర్‌లో లంక టీమ్ బస్సుపై దాడి జరిగినప్పుడు, ఎవరూ పాక్ వెళ్లడానికి ఇష్టపడకపోయినా తాము పర్యటించి పాక్ క్రికెట్‌ను బతికించామని గుర్తు చేసింది. ఇప్పుడు ఈ మెగా మ్యాచ్ రద్దయితే తమ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, కాబట్టి సహాయం చేయాలని కోరింది. దీనికి పాక్ నో చెప్పలేకపోయింది.

బంగ్లాదేశ్ కోసం డీల్: పాక్ తన పరువు కాపాడుకోవడానికి బంగ్లాదేశ్‌ను కూడా చర్చల్లోకి తెచ్చింది. బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి జరిమానాలు విధించకూడదని, భవిష్యత్తులో వారికి ఐసీసీ ఈవెంట్ హోస్టింగ్ హక్కులు ఇవ్వాలని పాక్ డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ అంగీకరించడంతో, బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకే తాము భారత్‌తో ఆడుతున్నామని పాక్ కలర్ ఇచ్చింది.

యూ-టర్న్ ముగింపు

ఎన్ని రాజకీయ డ్రామాలు ఆడినా, చివరకు ఆర్థిక ప్రయోజనాలే గెలిచాయి. పాక్ ప్రభుత్వం తన మొండిపట్టు వీడి, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో తలపడాలని తన జట్టును ఆదేశించింది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..