IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..

ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనున్న భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి విజయం తమదేనని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ధీమా వ్యక్తం చేశారు. గతంలో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా, తమ జట్టు సమతుల్యత, ఆటగాళ్ల ఫామ్‌పై నమ్మకం ఉందన్నారు.

IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..
Pak Captain Salman Agha

Updated on: Feb 11, 2026 | 8:55 PM

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఈ మెగా ఫైట్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, ఐసీసీ గట్టి హెచ్చరికలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు మెడలొంచింది. ఐసీసీ నిబంధనలను తోసిపుచ్చడంతో చేసేది లేక పాక్ జట్టు బరిలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. గతంలో ఆసియా కప్‌లో ఎదురైన ఘోర పరాజయాలను గుర్తు చేసుకుంటూనే, ఈసారి మాత్రం టీమిండియాపై విజయం సాధిస్తామని సల్మాన్ అలీ అఘా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ జట్టులో ఉన్న సమతుల్యత, ఆటగాళ్ల అద్భుతమైన ఫామ్ తమకు ప్రధాన బలమని నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాక్ అభిమానులకు ఈ విజయంతో కానుక ఇస్తామని సల్మాన్ ప్రగల్భాలు పలికారు. అటు పీసీబీ మాజీలు కూడా ఇది తమకు ప్రతిష్టాత్మకమైన పోరాటమని, మైదానంలో టీమిండియాను ఎదుర్కోవడానికి పక్కా వ్యూహాలు సిద్ధం చేశామని చెప్తున్నారు.

అయితే, చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే, భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 16 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో తలపడగా, అందులో టీమిండియా 13 విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పాక్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ప్రపంచకప్ వేదికలపై భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎనిమిది మ్యాచ్‌లలో భారత ఏడుసార్లు విజయకేతనం ఎగురవేయగా, పాక్ ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ రికార్డులు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ ఉండగా, పాక్ జట్టుపై ఒత్తిడిని పెంచుతున్నాయి. సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు ఆ జట్టుపై అదనపు ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. 2026 వరల్డ్ కప్ వేటలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. కొలంబో స్టేడియం అభిమానుల కోలాహలంతో నిండిపోనుండగా, సల్మాన్ అలీ అఘా చెప్పినట్లుగా పాక్ కొత్త చరిత్ర సృష్టిస్తుందా లేక సూర్యకుమార్ సేన తన రికార్డును పదిలపరుచుకుంటుందా అన్నది సర్వత్రా ఆసక్తి రేకిస్తోంది.