
On This Day in 2017: డిసెంబర్ 22.. భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ అభిమానులకు ఇదొక మర్చిపోలేని రోజు. సరిగ్గా 2017లో ఇదే రోజున రోహిత్ శర్మ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ రోజు రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కును అందుకున్నాడు.
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అప్పట్లో డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును రోహిత్ సమం చేశాడు. మొత్తం 43 బంతులు ఆడిన రోహిత్, 118 పరుగులు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఆ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 274.42. అంటే బంతి పడిందంటే బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా సాగింది అతని వేట. రోహిత్, కె.ఎల్. రాహుల్ (89) కలిసి మొదటి వికెట్కు కేవలం 12.4 ఓవర్లలోనే 165 పరుగులు జోడించారు.
ఈ సెంచరీతో టీ20ల్లో రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా, ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన భారత కెప్టెన్గా కూడా రికార్డు సృష్టించాడు. రోహిత్ విధ్వంసంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 260 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
గత ఎనిమిదేళ్లలో భారత జట్టులో ఎంతో మంది విధ్వంసకర బ్యాటర్లు వచ్చారు. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వంటి వారు సెంచరీలు బాదినప్పటికీ, టీ20ల్లో రోహిత్ శర్మ నెలకొల్పిన ’35 బంతుల సెంచరీ’ రికార్డు ఇప్పటికీ భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైనదిగా చెక్కుచెదరకుండా ఉంది.
రోహిత్ శర్మలోని అసలైన ‘హిట్మ్యాన్’ అవతారాన్ని ప్రపంచానికి చూపించిన ఇన్నింగ్స్ ఇది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో నేడు క్రికెట్ ప్రేమికులు #OnThisDay, #RohitSharma హ్యాష్ట్యాగ్లతో సందడి చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..