
ODI World Cup 2027 : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరం వన్డే వరల్డ్ కప్ 2027కు రంగం సిద్ధమవుతోంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే గత వరల్డ్ కప్లో భారత జట్టులో కీలక పాత్ర పోషించిన కొందరు స్టార్లు ఈసారి మైదానంలో కనిపించే అవకాశం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండగానే, మరో ఐదుగురు ఆటగాళ్లు మాత్రం ఈసారి రేసులో లేనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా, మిగిలిన నలుగురికి టీమిండియా తలుపులు దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది.
రవిచంద్రన్ అశ్విన్
భారతదేశం కన్న గొప్ప స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. 2023 ప్రపంచకప్లో జట్టులో ఉన్నప్పటికీ, అతనికి కేవలం ఒక్క మ్యాచ్లోనే (ఆస్ట్రేలియాపై) అవకాశం దక్కింది. ఆ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీసినా, ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే, 2024 డిసెంబర్లో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. దీనితో 2027 ప్రపంచకప్లో అశ్విన్ మ్యాజిక్ను మనం మిస్ కాబోతున్నాం.
సూర్యకుమార్ యాదవ్
టీ20 క్రికెట్లో ప్రపంచాన్ని శాసించిన సూర్యకుమార్ యాదవ్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన జట్టులో ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో సూర్య ప్రదర్శన నిరాశపరిచింది. ఇంగ్లాండ్పై చేసిన 49 పరుగులు తప్ప, మిగిలిన మ్యాచ్ల్లో కనీసం 25 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో వన్డే ఫార్మాట్లో అతని అవసరం లేదని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం కేవలం టీ20లకే పరిమితమైన సూర్య, వచ్చే వన్డే ప్రపంచకప్లో కనిపించడం అసాధ్యం.
మహమ్మద్ షమీ
2023 ప్రపంచకప్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించిన మహమ్మద్ షమీ, ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. గాయాల సమస్య ఒకవైపు అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో బహిరంగంగా జరిగిన వివాదం అతని కెరీర్ను ఇబ్బందుల్లో నెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీకి జట్టులో చోటు దక్కలేదు. కుర్రాళ్లు దూసుకొస్తుండటంతో 36 ఏళ్ల షమీకి 2027లో అవకాశం రావడం చాలా కష్టమనిపిస్తోంది.
శార్దూల్ ఠాకూర్
బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గతేడాది ప్రపంచకప్లో ఆరంభంలో మూడు మ్యాచ్లు ఆడినా ప్రభావం చూపలేకపోయాడు. హార్దిక్ పాండ్యా గాయపడినప్పుడు షమీకి అవకాశం రావడంతో శార్దూల్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత నుంచి వన్డే జట్టులో అతనికి స్థానం దక్కలేదు. తను 2027లో ఆడాలని కోరుకుంటున్నట్లు శార్దూల్ ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది కేవలం కలగానే మిగిలిపోయేలా ఉంది.
రవీంద్ర జడేజా
ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించే రవీంద్ర జడేజాకు కూడా 2027 ప్రపంచకప్ గడ్డు సవాల్గా మారింది. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో జడ్డూ నిరాశపరుస్తున్నాడు. ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మరోవైపు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆల్ రౌండర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో సెలక్టర్లు జడేజాను పక్కన పెట్టి యువతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..