ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా?

ODI Cricket: వన్డే క్రికెట్ చరిత్రలో 5000వ మ్యాచ్‌ మైలురాయి నమోదైంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమైన వన్డే ప్రయాణం కెనడా, స్కాట్లాండ్ పోరుతో అరుదైన ఘట్టానికి చేరుకుంది. తొలి వన్డే నుంచి 5000వ మ్యాచ్‌ వరకు క్రికెట్‌లోని ముఖ్యమైన మైలురాళ్లు, ప్రపంచ కప్ చరిత్రను తెలుసుకుందాం.

ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా?
5000th ODI Match

Updated on: Aug 07, 2026 | 7:09 PM

ODI Cricket: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 (2023-27)లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 07) స్కాట్లాండ్, కెనడా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. స్కాట్లాండ్‌లోని డూండీ నగరంలో ఉన్న ఫోర్త్‌హిల్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ చారిత్రక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

1971లో మొదలైన వన్డే క్రికెట్ ప్రయాణం

క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5న ఆస్ట్రేలియాలోని చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఆ కాలంలో ఒక్కో ఓవర్‌కు 6 బంతులకు బదులుగా 8 బంతులు వేసేవారు. అలాగే అప్పట్లో మ్యాచ్‌లు ప్రధానంగా 40 లేదా 60 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగేవి. 1975, 1979 సంవత్సరాల్లో జరిగిన తొలి రెండు వన్డే ప్రపంచ కప్‌లు కూడా 60-60 ఓవర్ల ఫార్మాట్‌లోనే నిర్వహించారు. కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వన్డే క్రికెట్ 50 ఓవర్లకు కుదించబడింది.

1 నుంచి 5000 వన్డేల మైలురాళ్ల ప్రయాణం

కాలం మారుతున్న కొద్దీ వన్డే మ్యాచ్‌ల సంఖ్య వేగంగా పెరిగింది. మొదటి 1000 వన్డేలు పూర్తి కావడానికి దాదాపు 24 సంవత్సరాలు పట్టింది. వివిధ మైలురాళ్లను దాటుకుంటూ వన్డే క్రికెట్ ఈ స్థాయికి చేరుకుంది:

మొదటి వన్డే: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (మెల్‌బోర్న్, 1971)

1000వ వన్డే: వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (నాటింగ్‌హామ్, 1995)

2000వ వన్డే: పాకిస్థాన్ vs జింబాబ్వే (షార్జా, 2003)

3000వ వన్డే: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (సౌతాంప్టన్, 2010)

4000వ వన్డే: హాంకాంగ్ vs పాపువా న్యూ గినియా (హరారే, 2018)

5000వ వన్డే: కెనడా vs స్కాట్లాండ్ (డూండీ, 2026)

వన్డే ప్రపంచ కప్ చరిత్ర, విజయాలు

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 13 పురుషుల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లు ముగిశాయి. మొట్టమొదటి ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 6 సార్లు వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇక టీమిండియా రెండు సార్లు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో తొలిసారి, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2011లో రెండోసారి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. తదుపరి వన్డే ప్రపంచ కప్ 2027 సంవత్సరంలో జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us