
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న అప్పటి బిహార్లోని రాంచీలో జన్మించారు. ప్రస్తుతం రాంచీ జార్ఖండ్లో ఉంది. ఆయన తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకీ దేవి. కుటుంబ మూలాలు ప్రస్తుత ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా ల్వాలీ గ్రామంతో సంబంధం కలిగి ఉన్నాయి. ధోని ముగ్గురు సంతానంలో చిన్నవాడు. కాగా వీళ్ల ఇంటి పేరు ధోని కాదు ధౌని.
ధోని పేరు ‘ధౌని’ నుంచి ‘ధోని’గా మారడానికి కారణం స్కూల్ రికార్డుల్లో జరిగిన స్పెల్లింగ్ పొరపాటుగా చెబుతారు. రాంచీలోని DAV జవహర్ విద్యా మందిర్లో చదువుతున్న సమయంలో ఆయన ఇంటిపేరు ‘Dhauni’కి బదులుగా ‘Dhoni’గా నమోదైంది. కుటుంబ సభ్యులు ఆ తప్పును సరిచేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది అధికారికంగా మారలేదు. చివరకు అదే స్పెల్లింగ్ ఆయన విద్యా రికార్డుల్లో కొనసాగి, క్రికెట్ ప్రపంచంలోనూ ధోనిగా స్థిరపడింది.
చిన్నతనంలో ధోనికి క్రికెట్ కంటే ఫుట్బాల్పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. స్కూల్ ఫుట్బాల్ జట్టులో ఆయన గోల్కీపర్గా ఆడేవారు. అయితే ఆయన ప్రతిభను గమనించిన క్రికెట్ కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్లో వికెట్ కీపర్గా ప్రయత్నించాలని సూచించారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
వికెట్ కీపర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ధోని కమాండో క్రికెట్ క్లబ్, అనంతరం CCL జట్టు తరఫున ఆడారు. ప్రతిభను మెరుగుపరుచుకుంటూ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టారు. అయితే టీమిండియాలోకి వెంటనే అవకాశం రాలేదు. క్రికెట్తో పాటు జీవనోపాధి కోసం రైల్వేలో ఉద్యోగం కూడా చేశారు. 2001 నుంచి 2003 వరకు ఖరగ్పూర్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా పనిచేశారు.
రైల్వే ఉద్యోగం చేస్తున్నప్పటికీ ధోని క్రికెట్ను మాత్రం వదల్లేదు. దేశవాళీ మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆయన.. అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్తో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాతి కథ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. ధోని నాయకత్వంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఒక చిన్న స్కూల్ స్పెల్లింగ్ తప్పిదంతో ‘ధౌని’ నుంచి ‘ధోని’గా మారిన పేరు.. చివరకు భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనూ ఒక బ్రాండ్గా నిలిచిపోయింది.