
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 28న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి మైదానంలో కనిపించనున్నాడు. అభిమానులు అతని ఆటను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ కావొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అతను అన్ని మ్యాచ్లు ఆడతాడా లేదా అనే సందేహాలపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా స్పందించారు.
ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తమ ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించింది. ఇటీవల ధోనీ నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీఎస్కే ఆటగాళ్లు కూడా త్వరలోనే క్యాంప్లో చేరనున్నట్లు సమాచారం. జట్టు పూర్తిస్థాయి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ధోనీ ఈ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఆడతాడనే విషయంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా అభిప్రాయం ప్రకారం ధోనీ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. అయితే దీనిపై తుది నిర్ణయం జట్టు మేనేజ్మెంట్ తీసుకుంటుంది. అతను కేవలం బ్యాట్స్మన్గా ఆడతాడా, వికెట్కీపర్-బ్యాటర్గా ఆడతాడా లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడా అన్నది కోచింగ్ స్టాఫ్ నిర్ణయిస్తుంది,” అని విశ్వనాథన్ తెలిపారు.
అలాగే తమ జట్టు మ్యాచ్లు తమిళనాడులోనే జరగనున్నాయని, బీసీసీఐ ఇప్పటికే 20 మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేసిందని, మిగతా షెడ్యూల్ త్వరలో ప్రకటించనుందని తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, శివమ్ దూబేపై కూడా సీఎస్కే సీఈఓ ప్రశంసలు కురిపించారు. “భారత్ వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలవడం ఎంతో గర్వకారణం. ముఖ్యంగా సీఎస్కేకు చెందిన సంజూ శాంసన్, శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశారు. ఇది మా జట్టుకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది,” అని ఆయన చెప్పారు. అలాగే సంజూ శాంసన్ సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..