
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి చేపట్టినప్పటి నుంచి జట్టు ప్రదర్శనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా ఉన్నప్పటికీ, టెస్టుల్లో వరుస ఓటములు గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ గంభీర్కు ఒక వింతైన సలహా ఇచ్చారు. గంభీర్ ముందుగా రంజీ జట్టుకు కోచింగ్ ఇచ్చి రెడ్-బాల్ క్రికెట్పై పట్టు సాధించాలని ఆయన సూచించారు.
గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 0-3తో వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. ఈ ఓటముల నేపథ్యంలో గంభీర్ అనుసరిస్తున్న ‘అగ్రెసివ్’ విధానం టెస్ట్ క్రికెట్కు సరిపోతుందా లేదా అనే చర్చ మొదలైంది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాంటీ పనేసర్, గంభీర్ నేరుగా జాతీయ జట్టుకు టెస్ట్ కోచ్గా వ్యవహరించడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “టెస్ట్ క్రికెట్ అనేది వ్యూహాలతో కూడిన ఆట. గంభీర్ టీ20లలో మంచి ఫలితాలు సాధించి ఉండవచ్చు, కానీ రెడ్-బాల్ క్రికెట్లో కోచింగ్ అనుభవం వేరు. అతను ఏదైనా ఒక రంజీ ట్రోఫీ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తే, ఐదు రోజుల ఆటలో వ్యూహాలను ఎలా అమలు చేయాలో మరింత బాగా అర్థమవుతుంది” అని పనేసర్ పేర్కొన్నారు.
గంభీర్ ఐపీఎల్లో మెంటార్గా కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపాడు. అయితే అది కేవలం 20 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే. దేశవాళీ క్రికెట్లో లేదా మరే ఇతర ఫార్మాట్లో పూర్తిస్థాయి కోచ్గా గంభీర్కు గతంలో అనుభవం లేదు. ఇదే విషయాన్ని పనేసర్ నొక్కి చెప్పాడు. టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్ల మానసిక స్థితిని, పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో గంభీర్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే గంభీర్తో సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఒకవేళ టెస్టుల్లో ఫలితాలు ఇలాగే ఉంటే, కేవలం పరిమిత ఓవర్లకే గంభీర్ను పరిమితం చేసి, టెస్టులకు విడిగా వీవీఎస్ లక్ష్మణ్ వంటి అనుభవం ఉన్న ఆటగాడిని కోచ్గా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.