
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్రను చూసి ఓర్వలేక పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ నోటికి పని చెప్పారు. గతంలో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించదని జోస్యం చెప్పి అడ్డంగా బుక్కైన అమీర్, ఇప్పుడు టీమిండియా సెమీస్ చేరిన తర్వాత మాట మార్చారు. వెస్టిండీస్తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సంజు శాంసన్ 97 పరుగులతో అదరగొట్టి భారత్ను విజయతీరాలకు చేర్చగా, ఈ విజయం వెనుక ఉన్న లోపాలను వెతికి పట్టుకుంటూ అమీర్ తన అక్కసును వెళ్లగక్కారు.
ఒక క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ అమీర్ మాట్లాడుతూ.. భారత్ సెమీస్కు చేరినప్పటికీ వారు ఆడుతున్న తీరు అస్సలు బాలేదని విమర్శించారు. ఒక ఇన్నింగ్స్ మొత్తం జట్టు లోపాలను కప్పిపుచ్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్పై అమీర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ మూడు, నాలుగు సులభమైన క్యాచ్లను వదిలేసిందని, అది సెమీస్ లాంటి కీలక మ్యాచ్లో కొంపముంచుతుందని హెచ్చరించారు. బౌలింగ్ విభాగంలోనూ జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు ఇస్తున్నారని, భారత్ కేవలం ఒక్క బౌలర్పైనే ఆధారపడి ఆడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
అయితే, టీమిండియాను విమర్శిస్తూనే సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ను అమీర్ కొనియాడక తప్పలేదు. సంజు శాంసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఆయన ప్రశంసించారు. “నేను సంజు శాంసన్ ఐపీఎల్ మ్యాచ్లు, ఇతర ఇన్నింగ్స్లు చాలా చూశాను. కానీ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, 65 వేల మంది ప్రేక్షకుల మధ్య, తీవ్రమైన ఒత్తిడిలో 50 బంతుల్లో 97 పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు. అది సంజు శాంసన్ క్లాస్ ఏంటో నిరూపించింది” అని అమీర్ చెప్పుకొచ్చారు. టీమిండియా బ్యాటింగ్ బలహీనతలు సంజు వల్లే బయటపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం టీమిండియా తన సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది. మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. 2022 టీ20 వరల్డ్ కప్లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్లో భారత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి అదే ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుని ఫైనల్కు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అమీర్ వంటి మాజీల విమర్శలకు మైదానంలోనే సమాధానం చెప్పాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. బుమ్రాకు తోడుగా మిగిలిన బౌలర్లు రాణించి, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటే భారత్ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.
మొత్తానికి పాక్ మాజీలు చేస్తున్న ఈ విమర్శలను భారత జట్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంజు శాంసన్ ఫామ్లోకి రావడం, బుమ్రా నిలకడగా రాణించడం జట్టుకు పెద్ద సానుకూల అంశం. అమీర్ చెప్పినట్టుగా ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్త పడితే ఇంగ్లాండ్ను చిత్తు చేయడం ఖాయం. మరి వాంఖడే గడ్డపై భారత్ తన సత్తా చాటుతుందా? లేక అమీర్ విమర్శలు నిజమవుతాయా? అన్నది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..