PSL 2026 : పీఎస్ఎల్ అంటేనే భయం.. ఐపీఎల్ అంటేనే ప్రాణం.. పాకిస్థాన్‎కు విదేశీ ప్లేయర్లు షాక్

PSL 2026 : ఐపీఎల్ 2026 ప్రభావంతో పీఎస్ఎల్ 11వ సీజన్ నుంచి 8 మంది విదేశీ ఆటగాళ్లు తప్పుకున్నారు. పీసీబీ చైర్మన్ లీగల్ యాక్షన్ హెచ్చరికలు జారీ చేసినా ప్లేయర్లు వెనక్కి తగ్గడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఏకంగా 8 మంది స్టార్ విదేశీ ప్లేయర్లు లీగ్ నుంచి తప్పుకోవడం పాకిస్థాన్ క్రికెట్‌కు పెద్ద అవమానంగా మారింది.

PSL 2026 : పీఎస్ఎల్ అంటేనే భయం.. ఐపీఎల్ అంటేనే ప్రాణం.. పాకిస్థాన్‎కు విదేశీ ప్లేయర్లు షాక్
Psl 2026

Updated on: Mar 22, 2026 | 5:34 PM

PSL 2026 :పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆశలపై నీళ్లు చల్లుతూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) ప్రారంభానికి ముందే విదేశీ ఆటగాళ్లు వరుసగా హ్యాండిస్తున్నారు. మార్చి 26న పీఎస్ఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుండగా.. కేవలం రెండు రోజుల వ్యవధిలో అంటే మార్చి 28న ఐపీఎల్ 19వ సీజన్ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన ఆఫర్లు, వ్యక్తిగత కారణాలతో ఏకంగా 8 మంది స్టార్ విదేశీ ప్లేయర్లు లీగ్ నుంచి తప్పుకోవడం పాకిస్థాన్ క్రికెట్‌కు పెద్ద అవమానంగా మారింది. ఐపీఎల్‌తో పోటీ పడాలనుకున్న పీసీబీకి ఇప్పుడు ఉన్న ఆటగాళ్లను కాపాడుకోవడమే గగనమైపోతోంది.

పీఎస్ఎల్ వదిలేసిన ఆ 8 మంది వీరులు వీరే

పీఎస్ఎల్ 11వ సీజన్ నుంచి తప్పుకున్న వారిలో అత్యంత కీలకమైన పేరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. రావల్పిండి పిండీస్ తరపున ఆడాల్సిన ఆయన వ్యక్తిగత కారణాలంటూ తప్పుకున్నారు. అలాగే క్వెట్టా గ్లాడియేటర్స్ స్టార్ స్పెన్సర్ జాన్సన్ కూడా లీగ్‌కు నో చెప్పారు. వెస్టిండీస్ ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్, గుడాకేష్ మోటి కూడా పీఎస్ఎల్ నుంచి వైదొలిగారు. వీరే కాకుండా ఇంగ్లాండ్ పేసర్ టైమల్ మిల్స్, జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ, అఫ్ఘానిస్తాన్ స్టార్ రహ్మానుల్లా గుర్బాజ్, సౌతాఫ్రికాకు చెందిన ఒట్నీల్ బార్ట్‌మన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఐపీఎల్ ఆఫర్లే ప్రధాన కారణమా?

ఆటగాళ్లు పీఎస్ఎల్ వదిలేయడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026. పీఎస్ఎల్ లో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఐపీఎల్ లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వెళ్లినా భారీగా డబ్బు వస్తుంది. ఉదాహరణకు, బ్లెస్సింగ్ ముజారబానీ కేకేఆర్ (KKR)లో చేరగా, దాసున్ షనక రాజస్థాన్ రాయల్స్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల నుండి పిలుపు రావడంతో చాలా మంది ఆటగాళ్లు పీఎస్ఎల్ ఒప్పందాలను పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల పీఎస్ఎల్ లో స్టార్ పవర్ తగ్గిపోతోందని పాక్ క్రికెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సీరియస్

ఆటగాళ్లు ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఐపీఎల్ వైపు వెళ్తున్న ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలో కోర్బిన్ బాష్ అనే ఆటగాడిపై తీసుకున్న చర్యలనే ఇప్పుడు కూడా అమలు చేస్తామని చెప్పారు. అయితే, ఆటగాళ్లు మాత్రం పీసీబీ బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పాకిస్థాన్-అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా విదేశీ ప్లేయర్ల భయాందోళనలకు ఒక కారణమని సమాచారం.

ఖైదీల్లాంటి భద్రత.. స్టేడియాల్లో ఫ్యాన్స్ లేరు

మరోవైపు, పీఎస్ఎల్ 2026 మ్యాచ్‌లను క్లోజ్డ్ డోర్స్ (ప్రేక్షకులు లేకుండా) నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. దేశంలో నెలకొన్న ఇంధన సంక్షోభం, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కరాచీ, లాహోర్ వేదికలకే మ్యాచ్‌లను పరిమితం చేశారు. ఆటగాళ్లకు దేశాధినేతలకు ఇచ్చే స్థాయి భద్రత కల్పిస్తామని చెబుతున్నా.. విదేశీ ప్లేయర్లు మాత్రం పాకిస్థాన్ వెళ్లడానికి మొగ్గు చూపడం లేదు. ఒకవైపు ఐపీఎల్ గ్లామర్, మరోవైపు పాక్ లోని అస్థిర పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us