
Lawrence Bishnoi Gang Involve Canada Cricket Match Fixing: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన కొన్ని నెలలకే కెనడా క్రికెట్ జట్టు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఫిక్సింగ్ ఆరోపణలు ఆ దేశ క్రికెట్ బోర్డును, ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ కుంభకోణంలో ప్రమేయం కలిగి ఉన్నట్లు తేలడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో బయటి వ్యక్తుల జోక్యం ఉందన్న అనుమానంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి అవినీతి నిరోధక విభాగం విచారణను ప్రారంభించింది. ఈ మ్యాచ్లో కెనడా ఓటమి పాలైనప్పటికీ, ఆటలో చోటుచేసుకున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. దర్యాప్తు కొనసాగుతుండగా, పంజాబ్, హర్యానా కేంద్రంగా పనిచేసే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఫిక్సింగ్ వెనుక ఉన్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ ప్రకారం, కెనడా క్రికెట్ బోర్డులోని కొందరు ఉన్నతాధికారులు, ఆటగాళ్లను బిష్ణోయ్ ముఠా సభ్యులు ప్రత్యక్షంగా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ సూచనల ప్రకారం మ్యాచ్ ఫలితాలను మార్చకపోతే, ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కెనడాలోని సర్రే నగరంలో ఉన్న ఒక హోటల్లో ఈ బెదిరింపులు జరిగినట్లు ఆధారాలు లభించాయి. భయంతో ఆటగాళ్లు ఇప్పటివరకు నోరు మెదపలేదని, ఒక బోర్డు సభ్యుని ఇంటిపై కాల్పులు కూడా జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
కెనడా జట్టు కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్లను కాదని 23 ఏళ్ల బజ్వాకు కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఫిబ్రవరి 17న చెన్నైలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బజ్వా తీసుకున్న నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కెనడా మంచి స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్లో బజ్వా అనవసరంగా వైడ్లు, నో బాల్స్ వేసి ప్రత్యర్థికి విజయాన్ని సులభతరం చేశాడని విచారణలో వెల్లడైంది. దీనిపై అవినీతి నిరోధక విభాగం అతడిని పిలిపించి ప్రశ్నించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..