
Jonty Rhodes Team India fielding coach: భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 లో బిజీగా ఉంది. అద్భుతంగా రాణిస్తోంది. ఈ టోర్నీ తర్వాత ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్, కోచింగ్ స్టాఫ్ పదవీకాలం ముగియనుంది. BCCI చాలా కాలంగా ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. చాలా మంది పోటీదారుల పేర్లు కూడా ముందుకు వచ్చాయి. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఫీల్డింగ్ కోచ్కు సంబంధించి కూడా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఈ పాత్రలో ఉన్న దక్షిణాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో ఉన్నట్లు నివేదికలలో తేలింది.
ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఈ పదవికి బాధ్యత వహించడానికి నిరాకరించారు. మళ్లీ ఈ పదవికి కూడా దరఖాస్తు చేయరు. అతని సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే ఉన్నారు. కొత్త ప్రధాన కోచ్ వచ్చినప్పుడల్లా, అతను తన సిబ్బందిలో కూడా మార్పులు చేస్తుంటాడు. ఇటువంటి పరిస్థితిలో, కొత్త వ్యక్తులు కూడా ఈ పోస్ట్లలోకి ప్రవేశించవచ్చు.
RevSportz నివేదిక ప్రకారం, జాంటీ రోడ్స్ను ఇంకా ఎవరూ అధికారికంగా సంప్రదించలేదు. అయితే అతని పేరు టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ కోసం పోటీదారులలో ఉంది. రోడ్స్ గతంలో కూడా 2019 సంవత్సరంలో ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. అవును, నేను భారత కొత్త ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాను. నా భార్య, నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాము. ఇది ఇప్పటికే మాకు చాలా ఇచ్చింది. మా ఇద్దరు పిల్లలు కూడా ఇండియాలోనే పుట్టారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కాకుండా, కోచింగ్ ప్రక్రియలో కొన్ని విషయాలను జోడించడం గురించి కూడా మాట్లాడాడు. అయితే, అప్పుడు ఆయన ఈ పదవికి ఎంపిక కాలేదు.
నెలాఖరులోగా బీసీసీఐ కొత్త కోచ్ని ప్రకటించే అవకాశం ఉండటం గమనార్హం. అదే సమయంలో, కొత్త కోచింగ్ సిబ్బంది జులై నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..