
భారత దేశీయ క్రికెట్లో ఓ సంచలనం నమోదైంది. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి జమ్మూ, కాశ్మీర్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. హుబ్లీలోని కేఎస్సీఏ స్టేడియం (KSCA Stadium) వేదికగా జరిగిన ఫైనల్లో కర్ణాటకతో డ్రా చేపుకున్న జమ్మూ & కాశ్మీర్, తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించడం ద్వారా ట్రోఫీని అందుకుంది.
ఇది వారి తొలి ఫైనల్ ప్రదర్శన కావడం విశేషం. టోర్నమెంట్ చరిత్రలో తొలి ఫైనల్లోనే టైటిల్ గెలిచిన తొమ్మిదో జట్టుగా జమ్మూ & కాశ్మీర్ నిలిచింది.
జట్టు ఓపెనర్ శుభమ్ పుందీర్ (Shubham Pundir) కీలక శతకం బాదాడు. యావర్ హసన్తో కలిసి రెండో వికెట్కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గాడిలో పెట్టాడు. మొత్తంగా రెండు శతక భాగస్వామ్యాలు, మూడు అర్ధశతక భాగస్వామ్యాలతో జమ్మూ, కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 584 పరుగులు నమోదు చేసింది.
బౌలింగ్లో అకిబ్ నబీ (Auqib Nabi) అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో ఏడోసారి ఐదు వికెట్లు సాధిస్తూ కర్ణాటక బ్యాటింగ్ను కుదేలు చేశాడు.
585 పరుగుల భారీ లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆడిన కర్ణాటకకు తొలి దెబ్బ నబీ రుచి చూపించాడు. రెండో రోజు లంచ్కు ముందు కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. తరువాత కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్ వికెట్లను వరుసగా పడగొట్టి జట్టును కష్టాల్లోకి నెట్టాడు.
కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 266 బంతుల్లో 160 పరుగులు చేసి పోరాడినా, జట్టు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చలేకపోయింది.
భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ, కాశ్మీర్ చివరి రోజు కూడా దూకుడును కొనసాగించింది. కమ్రాన్ ఇక్బాల్, సహిల్ లోట్రా శతకాలు సాధించి జట్టును విజయదిశగా నడిపించారు.
పరాస్ డోగ్రా (Paras Dogra) నాయకత్వంలోని జమ్మూ,కాశ్మీర్ జట్టు ఎనిమిది సార్లు చాంపియన్ అయిన కర్ణాటకను నిలువరించి చరిత్ర సృష్టించింది. తొలి ఫైనల్లోనే టైటిల్ గెలవడం వారి ప్రతిభకు నిదర్శనం.