
IPL 2026 Auction: ఐపీఎల్ వేలం అంటేనే కోట్లకు పడగలెత్తే ఆటగాళ్లు, అనూహ్యమైన బిడ్డింగ్స్. కానీ, డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో ఒక సంఘటన క్రికెట్ విశ్లేషకులను, అభిమానులను ముక్కున వేలేసుకునేలా చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది. అయితే, అసలు విషయం తెలిశాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) కోసం ఏకంగా రూ. 8.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, సన్రైజర్స్ హైదరాబాద్తో పోటీపడి మరీ లక్నో ఈ మొత్తానికి దక్కించుకుంది.
అయితే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. జోష్ ఇంగ్లిస్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడు. తన వివాహం, వ్యక్తిగత కారణాల వల్ల అతను ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని సమాచారం. అంటే ఒక్కో మ్యాచ్కు లక్నో జట్టు సుమారు రూ. 2.15 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క!
సాధారణంగా ఏ జట్టయినా సీజన్ మొత్తం అందుబాటులో ఉండే ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుంది. నిజానికి, గత సీజన్లో ఇంగ్లిస్ బాగా ఆడినప్పటికీ, అతను తక్కువ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని తెలిసే పంజాబ్ కింగ్స్ (PBKS) అతన్ని వదిలేసింది. కానీ, లక్నో మాత్రం అదే ఆటగాడి కోసం ఎగబడి కోట్లు కుమ్మరించడం విడ్డూరంగా ఉంది.
వేలంలో ఇంగ్లిస్ పేరు రాకముందు, లక్నో జట్టు లియామ్ లివింగ్స్టోన్ కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైంది (లివింగ్స్టోన్ను SRH దక్కించుకుంది). ఆ వెంటనే ఇంగ్లిస్ పేరు రావడంతో, ఆ ఆవేశంలో లేదా ప్రత్యామ్నాయం లేక లక్నో ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేలంలో ఫ్రాంచైజీలు కొన్నిసార్లు ఇలాంటి ‘బ్లండర్స్’ (Blunders) చేస్తుంటాయి. కేవలం 4 మ్యాచ్లు ఆడే ఆటగాడి కోసం ఇంత బడ్జెట్ కేటాయించడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అతను వెళ్ళిపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమవుతుంది. ఇది లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, కేవలం 4 మ్యాచ్ల కోసం రూ. 8.6 కోట్లు ఖర్చు చేసిన లక్నో నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..