
IPL 2027: భారత అత్యున్నత క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL)లో గత కొన్ని సీజన్లుగా మ్యాచ్లకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చే ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player) రూల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2027 టోర్నమెంట్కు ముందు ఈ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరోసారి తీవ్రంగా పునరాలోచిస్తోంది. ఆటలోని అసలు మజాను, ఆల్రౌండర్ల ప్రాధాన్యతను కాపాడే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయంపై దృష్టి సారించింది.
సెప్టెంబర్ 15న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించిన వేలాన్ని విదేశాల్లో కాకుండా పూర్తిగా మన దేశంలోనే నిర్వహించాలని నిశ్చయించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియను విదేశీ గడ్డపై నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశంలోనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భవిష్యత్తు గురించి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనను కొనసాగించడంపై బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్లోని మొత్తం 10 ఫ్రాంచైజీల నుంచి ప్రత్యేకంగా అభిప్రాయాలను సేకరించింది. 2026 సీజన్ ముగిసిన తర్వాత క్రికెట్కు సంబంధించిన పలు అంశాలపై జట్ల యాజమాన్యాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2024లో ప్రకటించిన 2025-27 ప్లేయర్ రెగ్యులేషన్స్లో ఈ రూల్ను 2027 వరకు ఉంచాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం జట్ల నుంచి వస్తున్న భిన్నమైన అభిప్రాయాల కారణంగా బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే ఐపీఎల్ 2027 నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పూర్తిగా తొలగించబడిందని చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతానికి దీనిపై కేవలం పునరాలోచన మాత్రమే జరుగుతోంది. సుమారు ఒక నెల రోజుల తర్వాత జరగబోయే తదుపరి సమావేశంలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత జట్ల స్క్వాడ్లు అన్నీ ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకునే తయారయ్యాయని కొన్ని ఫ్రాంచైజీలు భావిస్తుండగా, మరికొన్ని జట్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అందరి చూపు ఇప్పుడు బీసీసీఐ నిర్వహించబోయే నెక్స్ట్ మీటింగ్ పైనే నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..