IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? మార్చి 6 లేదా 7న బీసీసీఐ కీలక ప్రకటన

IPL 2026 : భారతదేశంలో క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను మార్చి 6 లేదా 7వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? మార్చి 6 లేదా 7న బీసీసీఐ కీలక ప్రకటన
IPL 2026

Updated on: Mar 04, 2026 | 8:04 AM

IPL 2026 : భారతదేశంలో క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను మార్చి 6 లేదా 7వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ వస్తుందని అందరూ భావించారు. కానీ, బీసీసీఐ ముందస్తుగానే షెడ్యూల్ విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. దీనివల్ల ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ సెషన్లను పక్కాగా ప్లాన్ చేసుకునే వీలుంటుంది.

ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ రెండు విడతల్లో రిలీజ్ కాబోతుండడం విశేషం.దీనికి ప్రధాన కారణం భారతదేశంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో మ్యాచ్‌లను ఎన్నికల రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ఎన్నికల తేదీలను బట్టి బీసీసీఐ రెండో విడత షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ప్రస్తుతానికి మొదటి విడత షెడ్యూల్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొగ్గు చూపింది.

మరి ఐపీఎల్ 2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే ఉత్కంఠకు కూడా తెరపడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. సీజన్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్‌లో జరగాలి. దీని ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ తొలి పోరు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మార్చి 28 లేదా 29వ తేదీన ఈ లీగ్ అట్టహాసంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తమ జట్టు 5 హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది.

అంతేకాదు, బెంగళూరు క్రికెట్ అభిమానులకు మరో భారీ గుడ్ న్యూస్ ఉంది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. మే 31వ తేదీన జరిగే తుది పోరుతో పాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌కు కూడా చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ప్రస్తుతం భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ ముగియగానే, విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన ఎన్ఓసీ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే వారం నాటికి అన్ని జట్లకు వారి ప్రాక్టీస్ సెషన్ల వివరాలను బీసీసీఐ అందజేయనుంది. ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ, క్రికెట్ లవర్సుకు ఎక్కడా వినోదం తగ్గకుండా బీసీసీఐ పక్కా స్కెచ్ వేస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us