
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా రాత్రి 10:10 గంటలకు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో, ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, రాజస్థాన్ ఓపెనర్లు తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై మెరుపు దాడికి దిగారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే 22 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ, అసలు సిసలైన వినోదం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశి క్రీజులోకి వచ్చాక మొదలైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్కు రాగా, వైభవ్ అస్సలు తడబడలేదు. బుమ్రా వేసిన తొలి బంతినే స్టాండ్స్లోకి పంపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇది చదవండి: ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్ మిస్..
ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా బుమ్రా, బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ లాంటి సీనియర్ల బౌలింగ్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఒక ఫోర్తో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 77 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ జట్టు 150 పరుగులు సాధించింది. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, రాజస్థాన్ బౌలర్ల ధాటికి 11 ఓవర్లలో 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ఆకాశానికెత్తాడు. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ను ఎదుర్కోవడంలో వైభవ్ చూపించిన ఆత్మవిశ్వాసం అద్భుతమని, అతడిని ఆపడం ఏ బౌలర్కూ సాధ్యం కాదని క్లార్క్ వ్యాఖ్యానించాడు. వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే ఒక వీడియో గేమ్ లా ఉందని, అతను క్రీజులో ఉండే ఆ నాలుగు ఓవర్లే ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తాయని కొనియాడాడు. కేవలం 15 ఏళ్ల వయసులో వైభవ్ చూపిస్తున్న ఈ తెగింపు క్రికెట్ ప్రపంచంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని క్లార్క్ ప్రశంసించాడు. కాగా, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో పాక్ క్రికెటర్లు 4 సిక్సర్లు కొట్టేందుకు 10 ఏళ్లు పట్టిందని.. కానీ మొదటి ఆరు బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ బుమ్రాను చెడుగుడు ఆడేసుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది చదవండి: రెండు మ్యాచ్లు.. రెండు మోసాలు.. కాటేరమ్మ కొడుకులపై పగ పట్టేశారుగా.!