IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..

ఐపీఎల్ 2026వ సీజన్ అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఎన్నికల కారణంగా తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. ఆ వివరాలు..

IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..
Ipl2026

Updated on: Mar 12, 2026 | 7:58 PM

ఐపీఎల్ 2026వ సీజన్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయడంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ 19వ ఎడిషన్ మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్లుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మొదటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్, ఆర్సీబీ తలపడనుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలోనే ఐపీఎల్ సందడి భారీగా ఉండనుంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ప్రస్తుతానికి కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బోర్డు ప్రకటించింది. మిగిలిన మ్యాచ్‌ల వివరాలను ఎన్నికల తేదీల ఖరారు తర్వాత వెల్లడించనున్నారు. ఈసారి ఐపీఎల్ మరింత భారీగా ఉండబోతోంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో గతంలో కంటే ఎక్కువ మ్యాచ్‌లు అంటే మొత్తం 84 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరిగే మొదటి విడతలో బెంగళూర్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలతో పాటు, గౌహతి, ముల్లాన్‌పూర్ వంటి వేదికల్లో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులో ఆడనుండగా, మరో రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ తమ తొలి కొన్ని మ్యాచ్‌లను గౌహతి వేదికగా ఆడబోతుండటం విశేషం. జూన్ 2025లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, మళ్లీ అక్కడ క్రికెట్ సందడిని నెలకొల్పడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. మొదటి షెడ్యూల్‌లో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

అయితే, ఐపీఎల్ 2026 మ్యాచ్ టైమింగ్స్ విషయంలో క్రికెట్ ప్రేమికుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు డబుల్ హెడర్ మ్యాచ్ ప్రారంభం అవ్వనుండగా, మిగతా రెగ్యులర్ మ్యాచ్‌లు అన్నీ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభించాలని నిర్ణయించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు లాగా రాత్రి 7 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభిస్తే అవి సరైన సమయానికి ముగిసి ప్రేక్షకులకు, ఆఫీసులకు వెళ్లేవారికి, విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగడం వల్ల వీక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీక్షకుల సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హాట్ స్టార్, బీసీసీఐ రెండు కూడా ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేలా కనబడటం లేదు.

ఇది చదవండి: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

Follow Us