
IPL 2026 Orange Cap : ఐపీఎల్ 2026 సీజన్లో అదిరిపోయే ఆదివారం ముగిసింది. ఒకే రోజు జరిగిన రెండు ఉత్కంఠభరిత మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ను 30 పరుగుల తేడాతో ఓడించగా, మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కేకేఆర్పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండు కీలక మ్యాచ్లు ముగియడంతో ఐపీఎల్ 2026 లీగ్ దశకు అధికారికంగా తెరపడింది. మొత్తం 70 లీగ్ మ్యాచ్లు కంప్లీట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసుపై పడింది. ఆదివారం నాటి ప్రదర్శనలతో ఈ లిస్టులో టాప్-10 పొజిషన్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ కేకేఆర్పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 200 స్ట్రైక్ రేట్తో 60 పరుగులు సాధించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ ఒక్కసారిగా పైకి దూసుకొచ్చాడు. అయితే మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీనివల్ల ఆరెంజ్ క్యాప్ లిస్టులో వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి కేఎల్ రాహుల్ నాలుగో స్థానానికి చేరుకోగా, వైభవ్ ఐదో స్థానానికి పడిపోయాడు. దురదృష్టవశాత్తూ రాహుల్ టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముందే తప్పుకోవడంతో అతని ఐపీఎల్ 2026 ప్రయాణం ఇక్కడితోనే ఎండ్ అయిపోయింది.
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ లీడర్బోర్డులో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ టాప్లో దూసుకుపోతున్నాడు. అతను 14 మ్యాచ్లలో 49.08 సగటుతో, దాదాపు 158 స్ట్రైక్ రేట్తో ఏకంగా 638 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. అతని వెనుకే గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 13 ఇన్నింగ్స్ల్లో 616 పరుగులతో రెండో స్థానంలో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్ల్లో 50.50 సూపర్ యావరేజ్తో 606 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 593 పరుగులతో నాల్గో స్థానంలో, వైభవ్ సూర్యవంశీ 583 పరుగులతో ఐదో స్థానంలో లీగ్ స్టేజ్ను ఫినిష్ చేశారు. ఇందులో వైభవ్ ఏకంగా 53 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలవడం విశేషం.
ఇక టాప్-10 లోని మిగతా స్థానాల విషయానికి వస్తే.. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఇషాన్ కిషన్ 14 మ్యాచ్ల్లో 569 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ 13 ఇన్నింగ్స్ల్లో 563 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం 14 ఇన్నింగ్స్ల్లో 206 భారీ స్ట్రైక్ రేట్తో 563 పరుగులు చేసి ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 14 మ్యాచ్ల్లో 50.64 సగటుతో 557 పరుగులు చేసి తొమ్మిదో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 13 ఇన్నింగ్స్ల్లో 510 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు.
ఇప్పటివరకు 70 లీగ్ మ్యాచ్లు పూర్తి కాగా.. ఇక కేవలం ప్లేఆఫ్స్ లో మూడు మ్యాచ్లు, ఆ తర్వాత గ్రాండ్ ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కేఎల్ రాహుల్, మిచెల్ మార్ష్, ప్రభ్సిమ్రాన్ సింగ్ జట్లు ప్లేఆఫ్స్ చేరనందున వారి పరుగుల వేట ఇక్కడితో ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు అసలైన ఆరెంజ్ క్యాప్ రేసు సాయి సుదర్శన్, శుభమన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్యే ఉండబోతోంది. రాబోయే నాకౌట్ మ్యాచ్ల్లో ఎవరైతే భారీ ఇన్నింగ్స్లు ఆడుతారో, వారే ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..