
BCCI vs DK Shivakumar: ఐపీఎల్ 2026 తుది పోరుకు ముందు సరికొత్త వివాదం చెలరేగింది. బెంగళూరులో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ను అకస్మాత్తుగా అహ్మదాబాద్కు మార్చడంపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే బెంగళూరు క్రీడాభిమానులకు బీసీసీఐ అన్యాయం చేసిందని ఆయన మండిపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయంపై డీకే శివకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉందని, కానీ కావాలనే దీన్ని గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలించారని ఆయన ఆరోపించారు. స్థానిక అభిమానులకు ఫైనల్ మ్యాచ్ చూసే గొప్ప అవకాశాన్ని దూరం చేశారని, దీని వెనుక పూర్తిగా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆయన విమర్శించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
డీకే శివకుమార్ ఆరోపణలను బీసీసీఐ అధికారికంగా ఖండించనప్పటికీ, తెరవెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. స్టేడియం సామర్థ్యం, భద్రతా పరమైన అంశాల వల్లే వేదికను మార్చాల్సి వచ్చిందని ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంతో పోలిస్తే అహ్మదాబాద్ స్టేడియం సామర్థ్యం చాలా ఎక్కువని, ఎక్కువ మంది అభిమానులకు అవకాశం కల్పించడానికే తమకు ఉన్న ప్రత్యేక అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రతినిధులు అంతర్గతంగా వివరిస్తున్నారు. గతంలో బెంగళూరు స్టేడియం పరిసరాల్లో జరిగిన కొన్ని చేదు సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలను కూడా భద్రతా కారణాల కింద పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదంలో మరో సంచలన వెర్షన్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ నిర్వహణ కోసం కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అదనపు టికెట్ల కోసం బీసీసీఐపై ఒత్తిడి తెచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వచ్చే 15 శాతం కోటా కంటే అదనంగా మరో 10 వేల టికెట్లను కేఎస్సీఏ డిమాండ్ చేసిందని సమాచారం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం వెయ్యి కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టడం వల్లే, విసిగిపోయిన బీసీసీఐ మ్యాచ్ను అహ్మదాబాద్కు మార్చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక క్రికెట్ సంఘం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఐపీఎల్ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం.. గత సీజన్లో ఏ జట్టు అయితే ఛాంపియన్గా నిలుస్తుందో, ఆ జట్టు హోమ్ గ్రౌండ్లోనే తర్వాతి సీజన్ క్వాలిఫయర్-1తో పాటు ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారు. గత ఏడాది బెంగళూరు కప్ గెలిచినందున ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలోనే జరగాలి. అయితే స్థానిక రాజకీయాలు, క్రికెట్ సంఘాల మధ్య సమన్వయ లోపం, టికెట్ల పంచాయితీ కారణంగా ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..