
IPL 2026 Final : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మరికొద్ది సేపట్లో టైటిల్ ఫైట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ గెలిచి బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కింగ్ విరాట్ కోహ్లీ స్టార్డమ్తో దూసుకుపోతున్న ఆర్సీబీ జట్టు, ప్రిన్స్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్తో తలపడుతుండటంతో మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
రెండో ఐపీఎల్ ట్రోఫీ కోసం కెప్టెన్ల వేట
ఇరు జట్లకు ఈ ఫైనల్ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ గతంలో చెరోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాయి. దీంతో ఈరోజు గెలిచిన జట్టు తమ ఖాతాలో రెండో ఐపీఎల్ టైటిల్ను వేసుకుంటుంది. ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్-1 లో గుజరాత్ను ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు రాగా, ఆ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 లో రాజస్థాన్ను చిత్తు చేసి అద్భుతమైన పునరాగమనంతో ఫైనల్లోకి దూసుకొచ్చింది. రెండు జట్లూ ఫుల్ ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
పిచ్ రిపోర్ట్
నేటి మహాసంగ్రామం నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ నంబర్ 6 పై జరగనుంది. 2025 సీజన్ నుంచి ఈ మైదానంలో జరిగిన 16 మ్యాచ్లలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 203 రన్స్గా నమోదైంది. విశేషం ఏంటంటే ఈ 16 మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 11 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ గెలిచిన జట్ల మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 213 పరుగులుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హెడ్-టు-హెడ్ రికార్డులు
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటివరకు 9 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. అహ్మదాబాద్ మైదానంలో మాత్రం ఇరు జట్ల రికార్డు 1-1 తో సమానంగా ఉంది. మొత్తం 9 మ్యాచ్ల్లో 8 సార్లు లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్లే గెలవడం ఒక విచిత్రమైన రికార్డు కాగా, ఈ సీజన్ క్వాలిఫయర్-1 లో మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు (ఆర్సీబీ) విజయం సాధించింది.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ కోసం ఆఖరి యుద్దం
ఈ ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరో తేలిపోనుంది. పర్పుల్ క్యాప్ రేసులో కగిసో రబాడా 28 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరు బౌలర్ల ప్రదర్శనే మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (776 రన్స్) టాప్లో ఉన్నాడు. అయితే గుజరాత్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (722 రన్స్), సాయి సుదర్శన్ (710 రన్స్) నేటి మ్యాచ్లో భారీ స్కోరు చేస్తే వైభవ్ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ అందుకోవచ్చు.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, రసిక్ సలాం దార్, జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్.
గుజరాత్ టైటాన్స్ (GT):
సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అర్షద్ ఖాన్/ఆర్ సాయి కిషోర్.