విశాఖ వాసులను అనుకోకుండా అదృష్టం వరించింది. ఐపీఎల్లో భాగంగా జరిగే రెండు కీలక ప్లే ఆఫ్ మ్యాచ్లను చూసే అవకాశం వారికి దక్కింది. మే 8, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమరావతి వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఈ మ్యాచ్లు చెన్నైలో జరగాల్సి ఉన్నా.. చెపాక్ స్టేడియంలోని I, J, K స్టాండ్స్ని తెరిచేందుకు తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) అనుమతివ్వకపోవడంతో వేదికను హైదరాబాద్కు మార్చారు.
అయితే మే 8, 10 తేదీల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కు భద్రత కల్పించడం కష్టంగా మారింది. దీంతో ఈ రెండు మ్యాచ్లను విశాఖ వేదికకు మార్చారు. మే 8న ఎలిమినేటర్ మ్యాచ్, మే 10న క్వాలిఫయర్ మ్యాచ్ విశాఖలో జరగనున్నాయి. ఇటీవలే విశాఖ మైదానాన్ని ఐపీఎల్ అధికారులు సందర్శించారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, మైదానం కండిషన్ను వారు పరిశీలించారు. అన్ని అనుకూలంగా ఉన్నాయని ఫిక్స్ అయ్యాకే విశాఖకు మ్యాచ్లను కేటాయించినట్టు సమాచారం. చివరిసారిగా 2016లో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి.