
క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. హౌజ్ ఆఫ్ క్రికెట్గా పిలిచే ఈ గ్రౌండ్లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్లో ఓడించడం పెద్ద విషయం అయితే.. అదీ లార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక గ్రౌండ్లో అందులోనూ ఒక టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ను పూర్తిగా డామినేట్ చేస్తూ హర్మన్ సేన ఈ అద్బుత విజయం సాధించింది. పైగా మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ను రెండు సార్లు ఆలౌట్ చేసి, అద్బుతంగా బ్యాటింగ్ చేసి.. టీమిండియా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన 83 పరుగులతో అదరగొట్టింది. లార్డ్స్లో టెస్ట్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్ రికార్డుకు కేవలం 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 58, దీప్తి శర్మ 57 పరుగులు చేసి రాణించారు.
ఇక తొలి ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లాండ్కు డెబ్యూ బౌలర్ క్రాంతి గౌడ్ ఊహించని షాకిచ్చింది. ఆమె దెబ్బకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం170 పరుగులకే ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ 5, సయాలీ 2, రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు మరింత చెలరేగిపోయి బ్యాటింగ్ చేశారు. స్మృతి మంధాన మరో హాఫ్ సెంచరీతో అద్బుతమైన ఆరంభాన్ని అందించింది. ఈ సారి 70 పరుగులు చేసి అవుట్ అయింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 33 రన్స్తో పర్వాలేదనిపించింది.
ఫొటో: ఐదు వికెట్ల హాల్ సాధించిన క్రాంతి గౌడ్ను అభినందిస్తున్న టీమ్మేట్స్
ఇక వన్ డౌన్లో వచ్చిన యస్తికా భాటియా అద్భుతమైన బ్యాటింగ్తో ఏకంగా సెంచరీతో కదం తొక్కింది. 158 బంతుల్లో 14 ఫోర్లతో 113 పరుగులు చేసి.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా తన పేరును లిఖించుకుంది. అలాగే ఇది తనకు కూడా తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అలాగే చివరల్లో రిచా ఘోష్ హాఫ్ సెంచరీతో రాణించింది. మొత్తంగా టీమిండియా 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను మూడో రోజు ఆట చివరి సెషన్లో డిక్టేర్ చేసింది. ఇక 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మరోసారి మన స్పిన్నర్లు తిప్పేయడంతో అద్భుత విజయం సొంతమైంది. నాలుగో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 186 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఏకంగా 270 పరుగుల తేడాతో ఈ ఏకైక టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి