
IND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్కు 76 పరుగుల భారీ ఓటమి ఎదురైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయి మ్యాచ్ను కోల్పోయింది. ఇప్పుడు సూపర్-8 దశలో టీమిండియా తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న జింబాబ్వే (IND vs ZIM)తో జరగనుంది. ఇది భారత్కు ‘చావో రేవో’ తరహా మ్యాచ్గా మారింది.
ఈ కీలక మ్యాచ్కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన మూడు పెద్ద వ్యూహాత్మక తప్పిదాలపై చర్చ సాగుతోంది. అవే తప్పిదాలు మళ్లీ పునరావృతమైతే, టీమిండియా టోర్నమెంట్ నుంచే బయటపడే ప్రమాదం ఉంది. ఆ మూడు తప్పిదాలేంటో ఓసారి చూద్దాం..
గత రెండు మ్యాచ్ల్లో టీమ్ మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో సుందర్ బ్యాటింగ్లో 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో కూడా వికెట్ తీయలేకపోయాడు.
జట్టు సమతౌల్యం పరంగా ఇది సరైన నిర్ణయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్షర్ పటేల్ ఆర్థికంగా బౌలింగ్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు వేగంగా పరుగులు చేసే సామర్థ్యం కలిగిన ఆల్రౌండర్. కీలక మ్యాచ్ల్లో అతని అనుభవం టీమిండియాకు ఎంతో అవసరం.
చెన్నై లాంటి స్పిన్కు అనుకూలమైన పిచ్లపై అక్షర్ లాంటి ఆల్రౌండర్ ఉండటం జట్టు బలాన్ని పెంచుతుంది. జింబాబ్వే (IND vs ZIM)తో కీలక మ్యాచ్లో కూడా అక్షర్కు అవకాశం ఇవ్వకపోతే, దాని ప్రభావం టీమిండియాపై పడే అవకాశముంది.
అభిషేక్ శర్మ, రింకూ సింగ్పై టీమ్ మేనేజ్మెంట్ వరుసగా నమ్మకం చూపుతోంది. కానీ తాజా ప్రదర్శనలు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. అభిషేక్ శర్మ తొలి మూడు మ్యాచ్ల్లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కేవలం 15 పరుగులకే ఔటయ్యాడు. టాప్ ఆర్డర్ విఫలం కావడం వల్ల భారత్ ఆరంభంలోనే ఒత్తిడిలో పడుతోంది.
ఇక ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. గత ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్రేట్ సుమారు 82.76 మాత్రమే ఉండటం టీ20 క్రికెట్కు చాలా తక్కువ. సగటు కూడా కేవలం 8.00 మాత్రమే. ఇలాంటప్పుడు జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్లో కూడా ఇదే కాంబినేషన్ కొనసాగిస్తే టీమిండియాకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.
ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పెద్ద టోర్నమెంట్ల్లో అతని అనుభవం, వెరైటీ, మధ్య ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఎంతో కీలకం.
భారత బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచడంలో ఇబ్బంది పడుతున్న వేళ, వికెట్ తీసే స్పిన్నర్ లేకపోవడం స్పష్టంగా కనిపించింది. చెన్నై వంటి పిచ్లపై స్పిన్కు సహకారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ను బయట ఉంచడం వ్యూహాత్మకంగా భారంగా మారవచ్చు. జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్లో కూడా అతడికి అవకాశం ఇవ్వకపోతే, ఇది టీమిండియాకు పెద్ద రిస్క్గా మారుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..