IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్పై పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?
IND W vs PAK W: మహిళల టీ20 క్రికెట్లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 17 సార్లు తలపడగా టీమిండియా 14 విజయాలు సాధించింది. పాకిస్థాన్ మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. 2022 ఆసియా కప్లో చివరిసారి భారత్పై గెలిచిన పాక్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. ఆసియా కప్ 2026లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో ఏకంగా 14 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో మాత్రమే పాకిస్థాన్ విజయం సాధించగలిగింది. పొట్టి ఫార్మాట్లో మన అమ్మాయిల దెబ్బకు పాక్ జట్టు పలుమార్లు చేతులెత్తేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో కూడా భారత జట్టునే విజయం వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
2009 నుంచి మొదలైన విజయాల పరంపర
2009 టి20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య తొలిపోరు జరిగింది. ఆ మ్యాచ్లో పాక్ను కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 2010 ప్రపంచ కప్లోనూ పాకిస్థాన్ను భారత్ మట్టికరిపించింది. 2012 ప్రపంచ కప్లో పాకిస్థాన్ కేవలం ఒక్క పరుగు తేడాతో తొలిసారి భారత్పై విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ వరుసగా మూడు మ్యాచ్ల్లో భారత్ తిరుగులేని విజయాలను అందుకుని పాక్కు చుక్కలు చూపించింది.
పాక్ గెలిచిన ఆ మూడు మ్యాచ్లు ఇవే
పాకిస్థాన్ జట్టు భారత్పై సాధించిన మూడు విజయాలు కూడా చాలా తక్కువ తేడాతోనే రావడం గమనార్హం. 2012లో ఒక పరుగు తేడాతో గెలిచిన పాక్, 2016 టీ20 ప్రపంచ కప్లో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో నెగ్గింది. ఇక ఆ తర్వాత ఆరు సంవత్సరాలకు, అంటే 2022 ఆసియా కప్లో చివరిసారిగా భారత్పై 13 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచింది. ఆ విజయాలన్నీ కూడా పాక్ జట్టు తీవ్రంగా శ్రమించి సాధించినవే తప్ప, భారత్ను ఏకపక్షంగా ఓడించిన సందర్భాలు లేవు. 2022 ఓటమి తర్వాత భారత్ వరుసగా 4 మ్యాచ్ల్లో పాక్ను చిత్తు చేసింది.
ఇరు జట్ల సభ్యుల వివరాలు
నేటి మ్యాచ్లో బరిలోకి దిగే భారత జట్టులో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహిస్తుండగా మునీబా అలీ, గల్ ఫిరోజా, నాష్రా సంధు, సాదియా ఇక్బాల్ వంటి ప్లేయర్లు తుది జట్టులో ఉన్నారు. సమర్థవంతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న భారత్ ఈ మ్యాచ్లోనూ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
