
Rohit Sharma : ప్రపంచ క్రికెట్లో దేనికైనా సాటిరాని సమరం.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రపంచమంతా ఫేవరెట్స్ ఎవరు అని చర్చిస్తుంటే, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తనదైన స్టైల్లో స్పందించారు. గత చరిత్రతో పనిలేదని, ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారని హెచ్చరించారు.
దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. “చాలామంది భారత్ను ఫేవరెట్ అంటున్నారు.. కానీ నేను ఆ పదాన్ని ఎప్పుడూ నమ్మలేదు. క్రికెట్ చాలా వింతైన ఆట. గత పదేళ్లలో ప్రపంచ క్రికెట్ చాలా మారిపోయింది. ఇప్పుడు చిన్న టీమ్స్ కూడా టీ20ల్లో బాగా ఆడుతున్నాయి. గతంలో మనం ఎన్ని మ్యాచ్లు గెలిచాం, ఎవరిపై పైచేయి సాధించాం అనేది ఆ రోజు లెక్కలోకి రాదు. మైదానంలో దిగాక ఏ జట్టు అయితే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుందో వారికే ఆ రెండు పాయింట్లు దక్కుతాయి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తుంది” అని రోహిత్ చాలా ఘాటుగా హెచ్చరించారు.
Rohit Sharma speaking about T20 cricket🎙️ pic.twitter.com/ZOcrQBKQep
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 11, 2026
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా, భారత్ ఏకంగా 7 సార్లు గెలిచి ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించింది. పాకిస్థాన్ కేవలం 2021లో మాత్రమే భారత్పై గెలిచింది. గతేడాది ఆసియా కప్లో మూడుసార్లు, గత రెండు టీ20 వరల్డ్ కప్లలో కూడా పాక్పై భారతే విజయం సాధించింది. అయితే, 2021లో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత జట్టులో రోహిత్ కూడా సభ్యుడే. అందుకే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత జట్టుకు ఆయన హితబోధ చేశారు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ పాకిస్థాన్ బౌలర్లు కూడా పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో దాయాదుల పోరులో మొదటిసారి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇప్పటికే వరల్డ్ నంబర్ 1 జట్టుగా ఉన్న భారత్, పాకిస్థాన్ను ఓడించి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ జట్టు గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..