
India vs England 3rd T20I: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీం ఇండియాకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం పాలవగా, రెండో టీ20లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాటింగ్హామ్ వేదికగా జరగబోయే మూడో టీ20లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చావో రేవో లాంటి ఈ మ్యాచ్ విశేషాలు మీకోసం.
ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఘోరంగా టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. వరుణుడి కరుణతో మొదటి మ్యాచ్ రద్దయినప్పటికీ, రెండో టీ20లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బేతల్ 76 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్తో భారత్ నోటికాడి ముద్దను లాగేసుకున్నాడు. దీంతో ప్రస్తుత సిరీస్ను కాపాడుకోవాలంటే టీం ఇండియాకు ఈ మూడో టీ20 అత్యంత కీలకంగా మారింది. ఇందులో ఓడిపోతే సిరీస్ గెలిచే అవకాశాన్ని భారత్ పూర్తిగా కోల్పోతుంది.
ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..
రెండో మ్యాచ్లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమనే చెప్పాలి. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మలుపు తిప్పిన 17వ ఓవర్లో రవి బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు ఇచ్చుకోవడంతో, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు చేజారింది. ఈ ఘోర ప్రదర్శన నేపథ్యంలో మూడో టీ20లో అతనిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రవి బిష్ణోయ్ స్థానంలో యార్కర్ల కింగ్గా పేరొందిన యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ గట్టిగా భావిస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.
ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్ అందింది. ఈ మ్యాచ్ ప్రసారమయ్యే సమయాల్లో భారీ మార్పులు చేశారు. సాధారణంగా రెండో టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకే ప్రారంభం కాగా, ఈ మూడో టీ20 మ్యాచ్ మాత్రం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. అంటే అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ మ్యాచ్ కొనసాగుతుంది. సిరీస్ భవితవ్యాన్ని తేల్చే ఈ ఉత్కంఠభరిత పోరును చూడాలంటే అభిమానులు రాత్రంతా నిద్ర మేల్కోవాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..