T20 World Cup 2026 Super 8 : నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్

T20 World Cup 2026 Super 8 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

T20 World Cup 2026 Super 8 : నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్
Team India

Updated on: Feb 23, 2026 | 3:05 PM

T20 World Cup 2026 Super 8 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో టీమిండియా దాదాపు 1200 రోజుల అజేయ రికార్డుకు తెరపడింది. చివరిసారిగా 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన భారత్, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో ఓటమి రుచి చూడటం గమనార్హం. ఈ పరాజయం కేవలం రికార్డులనే కాదు, సెమీఫైనల్ ఆశలను కూడా క్లిష్టతరం చేసింది.

ఇక సెమీఫైనల్ లెక్కల విషయానికి వస్తే, భారత్ ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉంది. సూపర్-8 గ్రూప్‌లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో భారత్ ఖాతాలో సున్నా పాయింట్లు ఉన్నాయి. భారత్ తన తదుపరి పోరులో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలిచి తీరాలి. కేవలం గెలిస్తే సరిపోదు, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతినడంతో, తదుపరి మ్యాచ్‌లలో భారీ ఆధిక్యంతో విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈక్వేషన్స్ ఎంత సంక్లిష్టంగా మారాయంటే.. భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచి, మరోటి ఓడిపోతే మాత్రం ఇతర జట్ల విజయాలు, ఓటములపై (నెట్ రన్ రేట్ ఆధారంగా) ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు అదృష్టం కలిసొస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఏది ఏమైనా జింబాబ్వేపై జరగబోయే తదుపరి పోరు భారత్‌కు డూ ఆర్ డై లాంటిది.

సౌతాఫ్రికా పై ఈ స్థాయిలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. సఫారీలు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో కూడా ఆరంభంలో మూడు వికెట్లు తీసినప్పటికీ, చివర్లో పరుగులను కట్టడి చేయలేకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. ఇప్పుడు కెప్టెన్, కోచ్ ముందున్న ఏకైక మార్గం.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, తదుపరి మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం. భారత్ పుంజుకుని సెమీస్ చేరుతుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us