సూర్యకుమార్ కెప్టెన్సీకి ఎసరు..? టీమిండియా టీ20 సారథిగా అతను ఫిక్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!

India Next T20I Captain: ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకోవడంతో క్రికెట్ ప్రియుల దృష్టి అంతా టీమిండియా తదుపరి అంతర్జాతీయ షెడ్యూల్‌పై పడింది. అయితే ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఇప్పుడు బీసీసీఐని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సూర్యకుమార్ కెప్టెన్సీకి ఎసరు..? టీమిండియా టీ20 సారథిగా అతను ఫిక్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!
India Next T20i Captain

Updated on: May 17, 2026 | 3:51 PM

India Next T20I Captain: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ముల్లన్‌పూర్‌లో ఏకైక టెస్టు మ్యాచ్, ఆ తర్వాత ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జూన్ చివరి వారంలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పర్యటనకు ముందే భారత టీ20 జట్టు సారథి విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్‌ను వెంటాడుతున్న ఫామ్ లేమి..

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా విజయవంతమైనప్పటికీ, బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సూర్య బ్యాట్ నుంచి పరుగులు రావడం గగనంగా మారింది. 2025లో 19 ఇన్నింగ్స్‌లలో కేవలం 13.62 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య, 11 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 17 సగటుతో 195 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ప్రదర్శనే ఇప్పుడు అతని కెప్టెన్సీ స్థానాన్ని ప్రమాదంలో పడేసింది.

గువహటి సమావేశంలో కీలక నిర్ణయం?

నమ్మదగిన సమాచారం ప్రకారం, మే 19న గువహటిలో జరగబోయే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తుపై అనధికారికంగా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాన్ని అధికారికంగా అఫ్గానిస్థాన్ టెస్ట్ సిరీస్ జట్టు ఎంపిక కోసం ఏర్పాటు చేసినప్పటికీ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 పర్యటనల దృష్ట్యా కొత్త కెప్టెన్ ఎంపికపైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టును సరికొత్తగా నిర్మించాలని యాజమాన్యం భావిస్తోంది.

రేసులో ఉన్న కొత్త నాయకులు వీరే..!

సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పలువురు సీనియర్, యువ ఆటగాళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి:

హార్దిక్ పాండ్యా: గతంలో భారత జట్టుకు విజయవంతంగా నాయకత్వం వహించిన అనుభవం ఉండటంతో హార్దిక్ పాండ్యా రేసులో అందరికంటే ముందున్నాడు.

శ్రేయస్ అయ్యర్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును నడిపిస్తున్న తీరు, అతని నాయకత్వ లక్షణాలు సెలెక్టర్లను బాగా ఆకట్టుకున్నాయి.

సంజూ శాంసన్, ఇషాన్ కిషన్: వికెట్ కీపర్ బ్యాటర్లయిన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పేర్లను కూడా బీసీసీఐ భవిష్యత్తు అవసరాల కోసం పరిశీలిస్తోంది.

టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పటికీ, నిలకడలేని ఫామ్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీని కోల్పోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి 2028 ప్రపంచకప్ లక్ష్యంగా బీసీసీఐ వేయబోయే ఈ సరికొత్త వ్యూహం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us