IND vs SA : రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!

IND vs SA : భారత్ , దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడవ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ల సమష్టి ప్రదర్శన తోడవ్వడంతో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

IND vs SA  : రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
Ind Vs Sa (2)

Updated on: Dec 06, 2025 | 8:47 PM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడవ, నిర్ణయాత్మక పోరులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తిరుగులేని విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, 9 వికెట్ల తేడాతో అలవోకగా ఛేదించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి అంతర్జాతీయ సెంచరీ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ ఈ భారీ విజయానికి బాటలు వేశాయి.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (4/66), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/41) ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు తీసుకుని సౌతాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకే పరిమితం చేశారు. సఫారీల తరఫున వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ (106 పరుగులు) ఒక్కడే వీరోచితంగా పోరాడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ టెంబా బావుమా (48)తో కలిసి డి కాక్ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా, మిగిలిన ఆటగాళ్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది.

271 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడం అద్భుతంగా సాగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్‌మ్యాన్ తన కెరీర్‌లో 61వ వన్డే హాఫ్ సెంచరీని 54 బంతుల్లో పూర్తి చేశాడు. 73 బంతుల్లో 75 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి రోహిత్ అవుటైనా, అంతకుముందే 20,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసి మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ అవుటైన తర్వాత, జైస్వాల్ 111 బంతుల్లో తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ, జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. కోహ్లీ కేవలం 40 బంతుల్లో తన 76వ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 116 పరుగులతో, విరాట్ కోహ్లీ 65 పరుగులతో నాటౌట్‌గా నిలవగా భారత్ 39.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us