
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే, ప్రకృతి మాత్రం మరోలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. శ్రీలంక వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, మ్యాచ్ రోజున కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ సాంప్రదాయకంగా స్లోగా ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పిచ్ తేమగా ఉండి, బంతి ఆగి వచ్చే అవకాశం ఉంది. సగటున ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 143 పరుగులు మాత్రమే. అంటే ఇది బ్యాటర్లకు కాస్త సవాలుతో కూడుకున్న మైదానమే. స్లో బంతులు వేసే బౌలర్లు, కట్టర్లు వేసే పేసర్లు ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపగలరు. టాస్ గెలిచిన జట్టు వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకుని చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 93 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, సాయంత్రం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అది 13 నుంచి 20 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే రోజంతా వర్షం కురిస్తే అవుట్ఫీల్డ్ తడిగా మారి మ్యాచ్ ప్రారంభం కావడం కష్టమవుతుంది. డ్రైనేజీ వ్యవస్థ బాగున్నప్పటికీ, పిడుగులతో కూడిన వర్షం వల్ల ఆట నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే, రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్, పాక్ రెండు జట్లూ 5 పాయింట్లతో సూపర్-8కు సులభంగా క్వాలిఫై అవుతాయి. కానీ దీనివల్ల అమెరికా, నెదర్లాండ్స్ జట్లకు భారీ నష్టం వాటిల్లుతుంది. అమెరికా తర్వాతి మ్యాచ్లో గెలిచినా కేవలం 4 పాయింట్లకే పరిమితమవుతుంది, కాబట్టి వారు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి భారత్ గెలిస్తేనే అమెరికాకు తర్వాతి రౌండ్కు వెళ్లే చిన్న అవకాశం ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..