
IND vs NZ T20 WC Final 2026 : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా పరుగుల ప్రళయం సృష్టించింది. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో గత రికార్డులను భారత్ బూడిద చేసింది.
గతంలో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోరు రికార్డు భారత్ పేరునే ఉండేది. 2024లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ సాయంతో భారత్ 176/7 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి కప్పు గెలిచింది. అయితే, నేడు సూర్య సేన ఆ స్కోరు కంటే ఏకంగా 79 పరుగులు అదనంగా జోడించి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది.
భారత యంగ్ బ్యాటర్ల విధ్వంసం:
అభిషేక్ శర్మ: కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది పవర్ప్లేలో కివీస్కు చుక్కలు చూపించాడు. మొత్తంగా 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
సంజూ శామ్సన్: తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్న సంజూ, వరుసగా మూడో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 89 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నా, కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
ఇషాన్ కిషన్: మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్తో రన్ రేట్ తగ్గకుండా చూశాడు.
శివమ్ దూబే: ఆఖరి ఓవర్లో జేమ్స్ నీషమ్ బౌలింగ్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు పిండుకుని స్కోరును 250 దాటించాడు.
కివీస్ ముందు కొండంత లక్ష్యం
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాలని చూసినా, దూబే హిట్టింగ్ ముందు అది సాధ్యం కాలేదు. ఇప్పుడు కివీస్ విజయానికి 256 పరుగులు చేయాలి. ఇంతటి భారీ లక్ష్యాన్ని ఫైనల్ ఒత్తిడిలో చేధించడం అసాధ్యమనే చెప్పాలి.