
IND vs IRE : భారత్, ఐర్లాండ్ మధ్య నేటి (జూలై 26) నుంచి ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందే వాతావరణం వేడెక్కింది. ఐపీఎల్ 2026 లో పరుగుల సునామీ సృష్టించి, టీమిండియాలోకి ఎంపికైన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ కెప్టెన్ లీగ్ టకర్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టకర్ మాట్లాడుతూ.. వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడైన ఆటగాడని ఒప్పుకుంటూనే, అతని అరంగేట్రం మ్యాచ్ను తాము పాడు చేస్తామని, అతని సెలబ్రేషన్స్ సాగనివ్వమని ధీమా వ్యక్తం చేశాడు.
నిజానికి, రెగ్యులర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయపడటంతో లీగ్ టకర్ గత వారమే ఐర్లాండ్ పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. వైభవ్ గురించి టకర్ మాట్లాడుతూ.. “ఈ ప్రొఫెషనల్ క్రికెట్ యుగంలో ఒక 15 ఏళ్ల అబ్బాయి అంతర్జాతీయ జట్టులో ఆడటం అనేది అసలు సాధ్యమేనా అనిపించింది. కానీ అతను చాలా స్పెషల్ ప్లేయర్. ఐపీఎల్ను అతను ఎలా ఊపేశాడో మేమంతా చూశాం. అతని ఆటతీరుపై మా బౌలర్లు ఇప్పటికే చాలా రీసెర్చ్ చేశారు. అతని డెబ్యూ మ్యాచ్పై ఇక్కడ భారీ హైప్ ఉంది, కానీ హోమ్ గ్రౌండ్లో ఆ సంబరాలను చెడగొట్టడానికి మేము ప్రయత్నిస్తాం” అని పేర్కొన్నాడు.
బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ గనుక నేటి మ్యాచ్ లో తుది జట్టులోకి వస్తే, భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడుతుంది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 1989 లో పాకిస్తాన్ పర్యటనలో తన 16వ ఏట అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల ప్రాయంలోనే వైభవ్ ఆ రికార్డును అధిగమించబోతున్నాడు. ఇటీవలే శ్రీలంక-ఎ జట్టుపై అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదడం విశేషం.
ఈ సిరీస్ లో ఐర్లాండ్ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ స్టిర్లింగ్తో పాటు ఆ జట్టులోని కీలక ఆటగాళ్లయిన జోష్ లిటిల్, మార్క్ అడైర్, బ్యారీ మెక్కార్తీ, కర్టిస్ కాంఫర్, జోర్డాన్ నీల్ వంటి స్టార్ ప్లేయర్లు వివిధ కారణాల వల్ల ఈ సిరీస్కు అందుబాటులో లేరు. అయినప్పటికీ, తమ సొంత పిచ్లు భారత ఆటగాళ్లకు అలవాటు లేని విధంగా కొంచెం నెమ్మదిగా ఉంటాయని, దీనిని ఆసరాగా చేసుకుని టీమిండియాపై ఒత్తిడి తెస్తామని కెప్టెన్ టకర్ ధీమాగా ఉన్నాడు.
ఐరిష్ కెప్టెన్ మాటలు ఎలా ఉన్నా, గణాంకాలు మాత్రం పూర్తిగా టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన భారత్ ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పటివరకు భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన 8 టీ20 మ్యాచ్ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఐర్లాండ్పై భారత్కు 100 శాతం విన్నింగ్ రికార్డు ఉంది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో స్టోర్మాంట్ క్రికెట్ గ్రౌండ్లో ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. దీని తర్వాత గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..