
2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రౌండ్ రాబిన్ రౌండ్లో నాలుగు మ్యాచ్లు గెలిచి, సెమీ ఫైనల్ రేసులో ముందంజలో ఉంది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్ని అక్టోబర్ 22న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే టోర్నీలో భారత్, న్యూజిలాండ్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కాబట్టి గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది. అదే సమయంలో సెమీఫైనల్కు వెళ్లే మార్గం మరింత సులభమవుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో, న్యూజిలాండ్ జట్టు 8 పాయింట్లు +1.923 నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో ఉంది. ఇక భారత జట్టు 8 పాయింట్లు, +1.659 నెట్ రన్ రేట్తో రెండవ స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లు అగ్రస్థానం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు ఇవ్వనున్నట్టు సమాచారం.
న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత, భారత్ తన తదుపరి మ్యాచ్ను ఇంగ్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న లక్నోలో జరగనుంది. అంటే ఈ మ్యాచ్కి వారం రోజుల సమయం మిగిలి ఉంది. దీంతో ఆటగాళ్లకు రెండు లేదా మూడు రోజులు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వెకేషన్ పీరియడ్లో ఆటగాళ్ళు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో గడపవచ్చు. అయితే అక్టోబరు 26న లక్నోలో ఆటగాళ్లంతా మరోసారి జట్టులో చేరనున్నట్లు సమాచారం. కాగా ఆసియా కప్ నుంచి వరుసగా మ్యాచ్లు ఆడుతోంది టీమిండియా. దీనికి తోడు వన్డే ప్రపంచకప్లో తొమ్మిది వేర్వేరు వేదికల్లో తొమ్మిది మ్యాచ్లు ఆడనున్న ఏకైక జట్టు భారత్. అందువల్ల టీమిండియా క్రికెట్లరకు కాస్త విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా మ్యాచ్కు 48 గంటల ముందు ఆటగాళ్ళు శిక్షణలో పాల్గొంటారు. అదే సమయంలో బ్యాకప్ ప్లేయర్లు మాత్రమే మ్యాచ్కు ఒక రోజు ముందు జట్టులో చేరతారు.
మరోవైపు, హార్దిక్ పాండ్యా గాయం భారత జట్టును ఆందోళనకు గురిచేసింది. పాండ్యా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. కాగా చికిత్సలో భాగంగా హార్దిక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నట్లు కూడా సమాచారం. విరామం తర్వాత హార్దిక్ లక్నోలో టీమ్ ఇండియా క్యాంపులో చేరనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..