
World Cup 2031 : టీ20 ప్రపంచకప్ 2026లో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసింది. ఈ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించినప్పటికీ, మ్యాచ్కు ముందు జరిగిన వివాదాలు అంతర్జాతీయ క్రికెట్ మండలిని తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. కేవలం ఒక వారం పాటు సాగిన హైడ్రామా ముగిసినా, దీని ప్రభావం రాబోయే మెగా టోర్నీలపై గట్టిగా పడేలా కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. భారత్ ఆతిథ్యమివ్వాల్సిన భవిష్యత్తు టోర్నమెంట్లపై ఐసీసీ నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ గొడవకు అసలు కేంద్రబిందువు బంగ్లాదేశ్. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించాలనే నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, తమ జట్టును ప్రపంచకప్ కోసం భారత్ పంపేందుకు నిరాకరించింది. దీనివల్ల బంగ్లాదేశ్ టోర్నీ నుండే తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను సాకుగా చూపిస్తూ పాకిస్థాన్ కూడా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని భీష్మించుక కూర్చుంది. చివరి నిమిషంలో ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాక్ వెనక్కి తగ్గింది. కానీ, ఈ రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ మనుగడకే ముప్పుగా మారాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రచురించిన కథనం ప్రకారం.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఐసీసీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. భారత్ ఆతిథ్యమివ్వాల్సిన 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే 2031 వన్డే ప్రపంచకప్ వేదికలను మార్చే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. ఈ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకపోతే, టోర్నీలను ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ భావిస్తోంది.
భవిష్యత్తులో పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ జట్లు భారత్కు రావడానికి మొండికేస్తే, ఆ టోర్నీలను పూర్తిగా ఆస్ట్రేలియాకు తరలించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాను బ్యాకప్ వెన్యూగా సిద్ధం చేస్తున్నారు. ఈ టోర్నీలో కేవలం 8 జట్లే ఉంటాయి కాబట్టి వేదికను మార్చడం ఐసీసీకి సులభం అవుతుంది. అయితే 2031 ప్రపంచకప్ను భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంది కాబట్టి, అప్పటి సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా, రాజకీయాల వల్ల భారత్ మెగా టోర్నీల ఆతిథ్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..