
Team India : టీ20 ప్రపంచకప్ 2026లో అమెరికాపై ఘనవిజయంతో జోరు మీదున్న టీమిండియాకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్ళీ జట్టులోకి రాబోతున్నాడు. ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా నమీబియాతో జరగనున్న రెండో మ్యాచ్ నాటికి ఆయన జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గత నెల రోజులుగా పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. జనవరి 11న న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు ఈ గాయమైంది. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతూ రిహాబిలిటేషన్లో ఉన్నాడు. ఈ కారణంగానే వరల్డ్ కప్లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్కు ఆయన అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని, ఢిల్లీలో జట్టుతో కలుస్తాడని కెప్టెన్ సూర్య క్లారిటీ ఇచ్చారు.
వాషింగ్టన్ సుందర్ కేవలం స్పిన్నర్ మాత్రమే కాదు, బ్యాటింగ్లోనూ కీలక పరుగులు చేయగల సమర్థుడు. టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో ఆయనకు మంచి పేరుంది. ఇప్పటివరకు 58 టీ20 మ్యాచ్లాడిన సుందర్ 51 వికెట్లు తీయడంతో పాటు, 254 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఎకానమీ రేటు చాలా తక్కువగా ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. అక్షర్ పటేల్కు తోడుగా సుందర్ కూడా జట్టులోకి వస్తే భారత్ స్పిన్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.
నమీబియాతో పోరు.. ప్లేయింగ్ 11లో మార్పులు?
అమెరికాపై భారత్ గెలిచినప్పటికీ, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, సుందర్ను ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్ రౌండర్ కోటాలో సుందర్ వస్తే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. అయితే, గెలిచిన జట్టును మారుస్తారా లేక అదే జట్టుతో కొనసాగుతారా అనేది చూడాలి. ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సూపర్-8 బెర్తు దాదాపు ఖాయమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..