
Hardik Pandya Fitness Update: భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చే తీపి కబురు అందింది. గత కొన్ని నెలలుగా గాయాలతో సతమతమవుతూ జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఫిట్నెస్ సాధించి ఆగస్టు నుంచి ఎంపికకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో టీమిండియా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి హార్దిక్ పాండ్యాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరంభంలో వెన్నునొప్పితో కొన్ని కీలక మ్యాచ్లకు దూరమైన ఆయన, ఆ తర్వాత కోలుకుని పునరాగమనం చేస్తారని అందరూ భావించారు. కానీ అఫ్గానిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో అనూహ్యంగా కాలు మడతపడటంతో జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన నాటికి పూర్తిగా కోలుకుంటారని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పొందుతున్న సమయంలో తొడ కండరాల గాయం తిరగబెట్టింది. దీనికి తోడు బౌలింగ్ చేయడానికి అవసరమైన పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఇలా వరుసగా వచ్చిన గాయాలు హార్దిక్ కెరీర్ను కొంతకాలం పాటు తీవ్రంగా ప్రభావితం చేశాయి.
వరుస సమస్యలతో ఇబ్బంది పడిన హార్దిక్ పాండ్యా, బెంగళూరులోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చాలా రోజులు గడిపాడు. అక్కడ వైద్య నిపుణులు, ఫిజియోల పర్యవేక్షణలో కఠినమైన వ్యాయామాలు చేశాడు. జట్టులోకి తిరిగి రావడానికి అత్యంత కీలకమైన ‘రిటర్న్-టు-ప్లే’ ప్రొటోకాల్ను ఆయన విజయవంతంగా పూర్తి చేశాడు.
ఏదైనా ఆటగాడు తీవ్రమైన గాయం నుంచి కోలుకున్న తర్వాత జాతీయ జట్టులోకి రావాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ ప్రొటోకాల్ పూర్తి చేయడం తప్పనిసరి. హార్దిక్ అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షలను విజయవంతంగా దాటడంతో, ఆగస్టు నెల నుంచి ఆయన ఎంపికకు సిద్ధంగా ఉన్నారని సమాచారం వెలువడింది.
ఆగస్టులో ఎంపికకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, హార్దిక్ టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్లో గానీ, రాబోయే ఆసియా క్రీడల్లో గానీ ఆయన కనిపించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వెస్టిండీస్తో జరగనున్న సిరీస్ ద్వారా ఆయన రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఈ మ్యాచ్ల ద్వారా హార్దిక్ పాండ్యా మళ్ళీ భారత జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆయా పరిస్థితుల్లో భారత్కు హార్దిక్ వంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ సేవలు అత్యంత కీలకం. ఆయన జట్టులో ఉంటే బ్యాటింగ్ లైనప్కు కొండంత కొండంత బలం చేకూరడమే కాకుండా, వేగవంతమైన బౌలింగ్ ప్రత్యామ్నాయం లభిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే వంటి యంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, హార్దిక్ ఉన్న స్థాయి అనుభవం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం వారికీ ఇంకా రాలేదు. అందుకే ప్రపంచకప్ సాధించాలంటే హార్దిక్ పూర్తి ఫిట్నెస్తో ఉండటం భారత్కు అత్యవసరం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..