Richa Ghosh : వరల్డ్ కప్ విజేతకు అరుదైన గౌరవం.. గోల్డ్‌ ప్లేటెడ్‌ బ్యాట్‌, బాల్‌తో సన్మానం

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ ఇండియాలోని క్రీడాకారులకు పలువురు ప్రముఖులు, క్రీడా సంస్థలు బహుమతులను ప్రకటిస్తున్నాయి.

Richa Ghosh :  వరల్డ్ కప్ విజేతకు అరుదైన గౌరవం.. గోల్డ్‌ ప్లేటెడ్‌ బ్యాట్‌, బాల్‌తో సన్మానం
Richa Ghosh

Updated on: Nov 06, 2025 | 3:39 PM

 Richa Ghosh : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ ఇండియాలోని క్రీడాకారులకు పలువురు ప్రముఖులు, క్రీడా సంస్థలు బహుమతులను ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భారత జట్టుకు చెందిన స్టార్‌ వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ రిచా ఘోష్‌కు అరుదైన బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆమె అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా గోల్డ్‌ ప్లేటెడ్‌ బ్యాట్‌, బాల్‌ను బహూకరించనున్నారు.

భారత మహిళా క్రికెట్‌ జట్టు వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ రిచా ఘోష్‌, ప్రపంచకప్‌ విజయంలో తన మెరుపు బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించారు. ఈ గొప్ప ప్రదర్శనకు గుర్తింపుగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆమెను ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, రిచా ఘోష్‌కు గోల్డ్ ప్లేటెడ్ బ్యాట్‌, బాల్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బంతి, బ్యాట్‌పై భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, అలాగే మహిళల క్రికెట్ దిగ్గజ క్రీడాకారిణి ఝులన్ గోస్వామి సంతకాలు చేసి అందించనున్నారు.

రిచా ఘోష్‌ను సన్మానించే ఈ నిర్ణయంపై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. “రిచా ఘోష్‌ను గౌరవించడం అసోసియేషన్‌కు చాలా గర్వకారణం. ఆమె తన అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది,” అని గంగూలీ అన్నారు. “రిచా ప్రపంచ వేదికపై అద్భుతమైన ప్రతిభ, సంయమనం, పోరాట స్ఫూర్తిని చూపింది. భారత క్రికెట్‌కు ఆమె చేసిన ఈ గొప్ప సహకారానికి గుర్తుగా, గోల్డ్ ప్లేటెడ్ బ్యాట్, బాల్ అందించడం మా తరపున ఒక చిన్న గౌరవం మాత్రమే” అని గంగూలీ అన్నారు.

మహిళల ప్రపంచకప్‌లో రిచా ఘోష్ బ్యాటింగ్ ప్రదర్శన టీమిండియా విజయంలో ముఖ్యమైంది. ఈ టోర్నమెంట్‌లో రిచా 8 ఇన్నింగ్స్‌లలో మొత్తం 235 పరుగులు చేసింది. ఆమె పరుగులు చేసిన విధానం మరింత ముఖ్యం. ఆమె 133.52 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసింది, ఇది ఆ టోర్నమెంట్‌లో ఉత్తమ స్ట్రైక్ రేట్గా నమోదైంది. కీలకమైన మ్యాచ్‌లలో చివర్లో వచ్చి ఆమె బాదిన బౌండరీలు, సిక్సర్లు భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాయి. టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 క్రీడాకారులలో రిచా కూడా ఉంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..