
Shreyas Iyer : ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత, క్రికెట్ వర్గాల్లో ఊహించని చర్చ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప ఈ నిర్ణయాన్ని విచిత్రమని అభివర్ణించారు. ఉతప్ప ట్విట్టర్లో టీ20 ప్రపంచ కప్కు ఇంకా 18 టీ20 మ్యాచ్లు ఉన్నాయని, అలాంటి సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్కు జట్టులో చోటు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. శ్రేయస్కు అతని గైర్హాజరీకి గల కారణాన్ని బీసీసీఐ తెలియజేసి ఉంటుందని ఆశిస్తున్నానని ఉతప్ప తెలిపారు.
మరో మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా తన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయంపై మాట్లాడారు. శ్రేయస్ పేరు రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చోప్రా అన్నారు. “రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా శ్రేయస్ పేరు లేదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తుది జట్టులో అతన్ని తీసుకోకపోవడం అర్థం చేసుకోదగినదే. ఎందుకంటే శివమ్ దూబే, రింకూ సింగ్ వంటి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు అవకాశం ఇచ్చారు. అయితే, రిజర్వ్ ప్లేయర్లలో ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. శ్రేయస్కు కూడా ఒక స్థానం కల్పించవచ్చు కదా. అతని పేరు అందులో కూడా లేకపోవడం సరైన సంకేతం కాదు. అతని టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత లేదు” అని చోప్రా వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ 2025లో అయ్యర్ ఆరో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతను 17 మ్యాచ్లలో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్లో బ్యాట్తో అత్యుత్తమ సీజన్. అతని అత్యధిక స్కోరు 97 నాటౌట్. పంజాబ్ కింగ్స్ జట్టును 2014 తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్కు చేర్చడంలో కూడా అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
There are around 18 T20I’s to go before India play the next #T20WC; not having #ShreyasIyer who was integral in helping you win the CT seems strange. But one can only hope that he gets into this side soon coz he deserves it! I hope they have communicated to him about his… https://t.co/lsa6MpvhLz
— Robbie Uthappa (@robbieuthappa) August 20, 2025
గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అయ్యర్ 26 మ్యాచ్లలో 25 ఇన్నింగ్స్లలో 49.94 సగటు, 179.73 స్ట్రైక్ రేట్తో 949 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోరు 130 నాటౌట్ ఉన్నాయి. ముంబై జట్టుకు కెప్టెన్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియాపై తన చివరి టీ20 మ్యాచ్లో 37 బంతుల్లో 53 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా అతనికి జట్టులో చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ను రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా చేర్చకపోవడం నిజంగా షాకింగ్గా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..