Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం వృథా.. హర్ష్ దూబే దెబ్బకు దిలీప్ ట్రోఫీలో ఊహించని ట్విస్ట్

Duleep Trophy 2026: దిలీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినా ఆ జట్టు ఆధిపత్యం సాధించలేకపోయింది. సెంచరీ ముంగిట వైభవ్ అవుట్ కాగానే కేవలం 66 పరుగుల వ్యవధిలోనే ఈస్ట్ జోన్ 8 వికెట్లు కోల్పోయి పేకమేడలా కూలిపోయింది.

Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం వృథా.. హర్ష్ దూబే దెబ్బకు దిలీప్ ట్రోఫీలో ఊహించని ట్విస్ట్
Harsh Dubey

Updated on: Aug 31, 2026 | 6:05 PM

Duleep Trophy 2026: దిలీప్ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల వరద పారించారు. సెంట్రల్ జోన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఆట మొదలైన దగ్గర నుంచే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 25 ఓవర్లలోనే 161 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 7 సిక్సర్లు, 7 ఫోర్లతో సెంట్రల్ జోన్ బౌలింగ్ విభాగాన్ని చెమటలు పట్టించాడు. అయితే సెంచరీకి చేరువైన వేళ మ్యాచ్ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి.

విజయవంతంగా సాగుతున్న ఈస్ట్ జోన్ జోరుకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే అడ్డుకట్ట వేశాడు. హర్ష్ దూబే వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచే క్రమంలో వైభవ్ బావుండ్రీ లైన్ వద్ద అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుతిరిగాడు. సూర్యవంశీ అవుట్ కావడంతోనే ఈస్ట్ జోన్ పతనం ప్రారంభమైంది. అదే జోరులో హర్ష్ దూబే కుమార్ కుషాగ్రను మొదటి బంతికే పంపించేశాడు. అనంతరం అనుకూల్ రాయ్, అభిజీత్ సర్కార్‌లను అవుట్ చేసి మొత్తం 4 వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్ కమర్‌ను విరిచాడు.

హర్ష్ దూబే సృష్టించిన దెబ్బ నుంచి ఈస్ట్ జోన్ తేరుకోలేకపోయింది. పేసర్లు యష్ ఠాకూర్, ఆర్యన్ పాండే తలో 3 వికెట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను యష్ ఠాకూర్ పెవిలియన్ చేర్చి ఈస్ట్ జోన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆర్యన్ పాండే కూడా విరాట్ సింగ్‌ను అవుట్ చేసి సెంట్రల్ జోన్‌ను బలమైన స్థితిలో నిలిపాడు. 66 పరుగుల స్వల్ప వ్యవధిలోనే 8 వికెట్లు సమర్పించుకోవడంతో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్ భవితవ్యం మారిపోయింది.

సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 266 పరుగుల వద్దే ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. వైభవ్ సూర్యవంశీ 93 పరుగులతో విరుచుకుపడినప్పటికీ జట్టుకు కనీస ఆధిక్యాన్ని అందించలేకపోయాడు. వికెట్లు చేతిలో ఉండి భారీ ఆధిక్యం సాధిస్తుందనుకున్న ఈస్ట్ జోన్, ఒక్కసారిగా కుప్పకూలడంతో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు 266 పరుగుల వద్ద సమంగా నిలిచాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us