
Team India : ఒకవైపు టీమిండియా సౌతాఫ్రికాపై తొలి వన్డే మ్యాచ్లో 17 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. కానీ మరోవైపు భారత జట్టులో వాతావరణం అస్సలు బాలేదనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, విభేదాలు ఉన్నాయని పలు నివేదికలు, సీనియర్ క్రీడా జర్నలిస్టులు పేర్కొంటున్నారు. ప్రాక్టీస్కు సంబంధించి ఈ ముగ్గురు దిగ్గజాల మధ్య వాగ్వాదం మొదలైందని, ఇది జట్టు వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వార్తలు వస్తున్నాయి.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో అసంతృప్తిగా ఉన్నారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వివాదానికి కారణం ఏమిటంటే.. రాంచీ వన్డేకు ముందు కోహ్లీ, రోహిత్ జట్టుతో కాకుండా విడిగా ప్రాక్టీస్ చేయాలని కోరారట. ఈ విషయం గౌతమ్ గంభీర్కు తెలియగానే, “వాళ్లు నా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి” అని అన్నట్లు సీనియర్ క్రీడా విలేఖరులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే.. ఇది టీమ్ వాతావరణానికి ఏ మాత్రం మంచిది కాదు. రాంచీ వన్డేలో కోహ్లీ, రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన తర్వాత, గంభీర్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ముగ్గురి మధ్య ఏదో సరిగా లేదని అభిమానులు సోషల్ మీడియాలో ఊహించుకోవడం మొదలుపెట్టారు.
టీమిండియా రాంచీ వన్డే గెలిచిన తర్వాత హోటల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఈ విభేదాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. జట్టులోని ఆటగాళ్లు అందరూ కలిసి విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటుండగా, విరాట్ కోహ్లీ మాత్రం ఆ వేడుకలో పాల్గొనకుండా నేరుగా తన రూమ్కు వెళ్లిపోయాడట. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ చాలా సేపు సీరియస్ మూడ్లో మాట్లాడుకోవడం కనిపించింది. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగా లేదనేలా వారి హావభావాలు ఉన్నాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలు జట్టులో అంతర్గతంగా ఏదో సమస్య నడుస్తోందని స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం భారత జట్టు రాంచీ నుంచి రాయ్పూర్కు చేరుకుంది. ఇక్కడ డిసెంబర్ 3న సౌతాఫ్రికాతో రెండవ వన్డే మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది, తొలి మ్యాచ్లో రోహిత్ (57), విరాట్ (135), కేఎల్ రాహుల్ (60) అద్భుత ప్రదర్శన చేశారు. ఆటగాళ్లు మైదానంలో బాగా ఆడుతున్నప్పటికీ, ఈ విభేదాల వార్తల్లో నిజమెంత ఉందో తెలియకపోయినా, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం జట్టులోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపై, మొత్తం టీమ్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ సమస్యను టీమ్ మేనేజ్మెంట్ ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..