Kavya Maran : ఐపీఎల్‎లో లేరుగా.. మరెందుకు రచ్చ? పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ

Kavya Maran : సన్‌రైజర్స్ లీడ్స్ పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై బీసీసీఐ స్పందించింది. విదేశీ లీగ్‌ల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. బీసీసీఐ ఈ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చేయడంతో కావ్య మారన్‌కు పెద్ద ఊరట లభించినట్టే.

Kavya Maran : ఐపీఎల్‎లో లేరుగా.. మరెందుకు రచ్చ? పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
Kavya Maran

Updated on: Mar 13, 2026 | 4:20 PM

Kavya Maran : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ద హండ్రెడ్ క్రికెట్ లీగ్ వేలం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.3 కోట్లకు కొనుగోలు చేయడమే ఈ రచ్చకు కారణం. భారత ఫ్రాంచైజీ యజమానులు విదేశీ లీగ్‌లలో కూడా పాక్ ఆటగాళ్లను తీసుకోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ గ్రూపుపై విమర్శలు కురిపిస్తూ, ఐపీఎల్‌లో ఆ జట్టును బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎట్టకేలకు స్పందించింది.

ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు. విదేశీ లీగ్‌లలో ఎవరు ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తారనేది తమ పరిధిలోకి రాదని ఆయన తేల్చి చెప్పారు. “మా అధికార పరిధి కేవలం ఐపీఎల్ వరకు మాత్రమే పరిమితం. ఇతర లీగ్‌లలో ఏమి జరుగుతుందో మాకు అనవసరం. బయట దేశాల్లో జరిగే లీగ్‌లలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని తీసుకుంటుందనే విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఐపీఎల్‌లో మాత్రం పాక్ ఆటగాళ్లు లేరు. బయట లీగ్‌లలో ఏ ఆటగాడిని కొన్నా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు, దానివల్ల మాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో కావ్య మారన్ నిర్ణయంపై బీసీసీఐకి ఎలాంటి అభ్యంతరం లేదని అర్థమవుతోంది.

మార్చి 12న ఇంగ్లాండ్‌లో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అబ్రార్ అహ్మద్ కోసం 1.90 లక్షల పౌండ్లను వెచ్చించింది. ద హండ్రెడ్ లీగ్‌లో మొత్తం నలుగురు ఐపీఎల్ యజమానులు జట్లను కొనుగోలు చేశారు. సన్‌రైజర్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ (MI లండన్), లక్నో సూపర్ జెయింట్స్ (మాంచెస్టర్ సూపర్ జెయింట్స్), ఢిల్లీ క్యాపిటల్స్ (సదరన్ బ్రేవ్) జట్లు కూడా ఉన్నాయి. అయితే, మిగిలిన మూడు ఫ్రాంచైజీలు ఏ పాక్ ఆటగాడి కోసం కనీసం వేలంలో బిడ్ కూడా వేయలేదు. కేవలం కావ్య మారన్ జట్టు మాత్రమే అబ్రార్ కోసం పోటీపడి దక్కించుకోవడంతో ఈ చర్చ మొదలైంది.

ఈ పరిణామంపై భారత నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో పాక్ ఆటగాళ్లకు భారతీయ యజమానులు ఆర్థికంగా లాభం చేకూర్చడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, ఇది కేవలం క్రీడ మాత్రమేనని, విదేశీ లీగ్‌లలో ఎవరినైనా కొనుగోలు చేసే స్వేచ్ఛ యజమానులకు ఉంటుందని మరికొందరు సమర్థిస్తున్నారు. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చేయడంతో కావ్య మారన్‌కు పెద్ద ఊరట లభించినట్టే. కానీ, అభిమానుల కోపాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us