
Team India: జపాన్లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) నగరంలో ఆసియా క్రీడలు (Asian Games 2026) సెప్టెంబర్ 19 తేదీన అధికారికంగా ప్రారంభం కానుండగా, మహిళల క్రికెట్ పోటీలు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్ 17 ప్రారంభ తేదీగా మొదలుకానున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ పద్ధతిలో పోటీపడే ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు (Team India) తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో స్థానం లభించింది. భారత మహిళల జట్టు సెప్టెంబర్ 18వ తేదీన ఆతిథ్య జపాన్ క్రికెట్ జట్టు (Japan Cricket Team) తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10.30 గంటల సమయానికి జరగనుండగా, ఈ సమరంలో నెగ్గిన జట్టు సెప్టెంబర్ 20న జరిగే సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది.
టోర్నమెంట్ ప్రారంభ రోజున బంగ్లాదేశ్-చైనా, పాకిస్తాన్-థాయిలాండ్ తలపడతాయి. మరుసటి రోజు శ్రీలంక-మలేషియా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్-జపాన్ పోటీ జరుగుతుంది. సెప్టెంబర్ 22న ఉదయం కాంస్య పతక పోరు, ఆ వెంటనే స్వర్ణ పతక పోరు జరుగుతాయి. 2023లో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన గత క్రీడల్లో శ్రీలంకను చిత్తు చేసి భారత్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి పసిడి వేటలో ఫేవరెట్గా భారత అమ్మాయిలు రంగంలోకి దిగుతున్నారు.
ఇటీవల ముగిసిన ఆసియా కప్ (Asia Cup) టోర్నీలోనూ అపజయమనేదే లేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి ట్రోఫీ గెలిచింది. జట్టులో ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ (Shafali Verma) అద్భుతమైన ఫామ్లో ఉండటం జట్టుకు పెద్ద బలం. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి, దీప్తి శర్మ (Deepti Sharma) నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.
హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత బృందంలో రిచా ఘోష్, జి.కమలిని, భారతి ఫూల్మాలి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్, నందినీ శర్మ ఉన్నారు. సమష్టి ప్రదర్శనతో ఈసారి కూడా బంగారు పతకాన్ని నిలబెట్టుకోవాలని జట్టు పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..