
IPL 2025లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో ఐదవ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ ప్లేస్కు చేరుకుంది. గుజరాత్ను అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీపై 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్ తర్వాత ఈ సీజన్లో 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణను ఈ స్థాయికి తీసుకెళ్లడంలో జీటీ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ టేకింగ్ బౌలర్గా ఎదిగాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో 11.5 స్ట్రైక్ రేట్తో బౌలింగ్ చేస్తున్నాడు. అంటే ప్రతి 12వ బంతికి వికెట్ తీసుకుంటున్నాడు.
గతంలో ప్రసిద్ధ్ కృష్ణ ఇంత ఎఫెక్టీవ్గా కనిపించలేదు. ఈ సంవత్సరం గుజరాత్ టైటాన్స్లో చేరిన తర్వాత అతని బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. ఆశిష్ నెహ్రా పర్యవేక్షణలో అతను డేంజరస్ బౌలర్గా మారాడు. 2018లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ నాలుగు సీజన్లలో 9 కంటే ఎక్కువ, ఒక సీజన్లో 8 కంటే ఎక్కువ ఎకానమీని కలిగి ఉన్నాడు. కానీ, ఈ సీజన్లో అతని ఎకానమీ 7.44 మాత్రమే. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ప్రసిద్ధ్ కృష్ణకు గుజరాత్ టైటాన్స్ రూ.9.50 కోట్ల భారీ ధర చెల్లించి తీసుకుంది. అందుకు తగ్గట్లే ప్రసిద్ధ్ అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. పంజాబ్ కింగ్స్పై ఒక్క వికెట్ కూడా తీయకుండా 41 పరుగులు ఇచ్చాడు.
కానీ తరువాతి మ్యాచ్లో రిథమ్ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ప్రసిద్ధ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇది అతని 7 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్లో మొదటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఆ తర్వాత ఆర్సీబీపై 26 పరుగులిచ్చి ఒక వికెట్, ఎస్ఆర్హెచ్పై 25 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఎల్ఎస్జిపై 26 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. ఇలా సూపర్ బౌలింగ్తో చెలరేగిపోతున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు జీటీకి ప్రధాన బౌలర్గా మారాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..